మాడ వీధులను చూస్తుంటే సంతోషంగా ఉంది
మంచి కార్యక్రమంలో పాలుపంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నా
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
కమాన్చౌరస్తా, ఫిబ్రవరి 11 : వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న పంచమ వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుమలను తలపిస్తున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆమె జిల్లా కేంద్రానికి రాగా, అల్గునూర్లోని ఒక ఫంక్షన్ హాల్ టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఆమె మార్కెట్ రోడ్డు వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో ఆలయ ఈవో కిషన్ రావు, అర్చకులు ఆమెకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆమె స్వామివారిని దర్శించుకుని, హనుమత్ వాహనానికి పూజలు నిర్వహించారు. మంత్రి గుంగుల కమలాకర్ కుటుంబ సభ్యులు ఎమ్మెల్సీ కవితకు పట్టువస్ర్తాలను అందజేశారు. అనంతరం ఆమె ఆలయ పరిసరాలను చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఆ తర్వాత మాట్లాడుతూ, కరీంనగర్లో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు తిరుమలను తలపించేలా ఉన్నాయని, మాడ వీధులన్నీ అందంగా అలంకరించి, మంత్రి గంగుల కమలాకర్, మేయర్ వై సునీల్ రావు, నాయకులు ఈ వేడుకలు నిర్వహించడం నగర వాసులు చేసుకున్న అదృష్టమన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉన్నదని చెప్పారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణా రావుతో కలిసి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రామడుగు సింగల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వర్ రావు నివాసంలో విందుకు హాజరుకాగా, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు వీర్ల కవితా వెంకటేశ్వ రావు, వెలిచాల సర్పంచ్ సరోజనా ప్రభాకర్ రావు ఘన స్వాగతం పలికారు.