రాష్ట్రంలో 430 శాఖలతో సేవలు
తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ అరవింద్
వేములవాడ, ఫిబ్రవరి 11: రాష్ట్రంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రూ.22వేల కోట్ల వ్యాపార లక్ష్యాన్ని అధిగమించిందని బ్యాంక్ చైర్మన్ వీ అరవింద్ వెల్లడించారు. శుక్రవారం వేములవాడలో కొత్త భవనంలోకి మారిన తెలంగాణ గ్రామీణ బ్యాంకు శాఖను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఏడు రీజియన్లలో 430 శాఖల ద్వారా ప్రజలకు ప్రస్తుతం సేవలు అందిస్తున్నామన్నారు. ఇప్పటివరకు రూ.22వేల కోట్ల వ్యాపారం చేయగా రూ.300 కోట్ల నికర ఆదాయంతో బ్యాంక్ ముందంజలో ఉందన్నారు. వేములవాడ బ్యాంక్ ఏడాదికి రూ.155 కోట్ల లావాదేవీలు జరుపుతూ రీజియన్లోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. రూ.120 కోట్ల డిపాజిట్లు సేకరించడమే కాకుండా రూ.35 కోట్ల రుణాలు ఇచ్చామన్నారు. బ్యాంకులో వ్యవసాయ, వ్యవసాయేతర, మహిళా సంఘాలు, బంగారు, గృహ రుణాలు ఇస్తామన్నారు. డిపాజిట్లపై ఇతర బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ ఇస్తామని, ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ గంగాధర్, వేములవాడ బ్రాంచ్ మేనేజర్ ఎన్. శ్రీనివాసరావు, జిల్లాలోని ఇతర బ్యాంక్ మేనేజర్లు బానోత్ దేవేందర్, సుధాకర్, నర్సింహాచారి, సత్యం, బ్యాంక్ సిబ్బంది మానస, గణపతి, సంతోష్ నారాయణ, ఖాతాదారులు తదితరులు ఉన్నారు.