నూటికి నూరు శాతం సురక్షితం
మంత్రి గంగుల కమలాకర్
విద్యానగర్, ఏప్రిల్ 19: కొవిడ్ టీకాపై అపోహలు అవసరం లేదని, టీకా నూటికి నూరుశాతం సురక్షితమని మంత్రి గంగుల కమలాకర్ భరోసా ఇచ్చారు. సోమవారం నగరంలోని ఆర్టీసీ వర్షాప్ దవాఖానలో కొవిడ్ మొదటి డోస్ టీకా తీసుకున్నారు. అనంతరం వ్యా క్సినేషన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా వ్యాక్సినేషన్పై ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు. సిబ్బందితో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆయన కేంద్రంలో ఉన్న సదుపాయాలు, టీకా సరఫరాపై అధికారులతో చర్చించి అందుబాటులో ఉండేలా ఆదేశించారు. టీకా నూటికి నూరుశాతం సురక్షితమైనదని, కరోనా ఉధృతి నుంచి కచ్చితంగా కాపాడుతుందన్నారు. టీకా తీసుకున్నా మాస్క్, భౌతిక దూరం పాటించినప్పుడే పూర్తి రక్షణ లభిస్తుందన్నారు. మంచి ఆహార అలవాట్లు పాటిస్తూ, శారీరక వ్యాయామం, యోగా వంటివి చేస్తూ మానసికంగా ప్రశాంతంగా ఉండాలన్నారు. కరోనా వేగంగా విస్తరిస్తున్న వేళ అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రభుత్వం హాస్పిటళ్లలో బెడ్లు, మందులను అందుబాటులో ఉంచడంతో పాటు ప్రైవేట్ హాస్పిటళ్లలో సైతం అధిక ధరలను నియంత్రిస్తున్నదని, ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.