జమ్మికుంట రూరల్, సెప్టెంబర్ 3: ఆర్థిక మంత్రి హరీశ్రావుపై బీజేపీ నాయకుడు ఈటల సంస్కారం లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని, రాజేందర్కు ఉప ఎన్నికలో ప్రజలే బుద్ధి చెబుతారని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ పేర్కొన్నారు. జమ్మికుంట మండలంలోని వెంకటేశ్వర్లపల్లి, వావిలాల, గండ్రపల్లి గ్రామాల్లో శుక్రవారం వేర్వేరుగా నిర్వహించిన టీఆర్ఎస్ శ్రేణుల సమన్వయ సమావేశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయా చోట్ల పార్టీ కార్యాచరణపై చర్చించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈటల ఆత్మగౌరవం పేరిట ఆస్తులు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల పక్షాన నిలిచి, అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే, కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసే దిశగా అడుగులు వేస్తున్నదని ధ్వజమెత్తారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యులపై భారం మోపిందన్నారు. సోషల్ మీడియాలో బీజేపీ చేస్తున్న విషప్రచారాన్ని తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేస్తే ఉప ఎన్నికలో ఉద్యమ బిడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అత్యధిక మెజార్టీతో గెలువడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, ఎంపీపీ దొడ్డె మమత, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు కనపర్తి లింగారావు, వైస్ ఎంపీపీ తిరుపతిరావు ఎంపీటీసీల ఫోరం అధ్యక్షురాలు కడవేర్గు మమత, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామకమిటీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మాచనపల్లి గ్రామంలో 35లక్షలతో అంబేద్కర్ కమ్యూనిటీ భవనం, యాదవ సంఘ భవనం, బతుకమ్మ ఘాట్ నిర్మాణానికి ఎమ్మెల్యే అరూరి రమేశ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. 70ఏళ్లలో జరుగని అభివృద్ధిని ఏడేండ్లలో చేసి చూపెడుతున్నామన్నారు. ఉద్యమ బిడ్డ గెల్లు శ్రీనివాస్యాదవ్ను ఆశీర్వదించి ఉప ఎన్నికలో గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ కల్పన, రాష్ట్ర నాయకుడు శ్రీధర్రెడ్డి, ఆర్బీఎస్ జిల్లా కనపర్తి లింగారావు, ఎంపీటీసీ రాజేశ్వర్రావు, కార్యకర్తలున్నారు.