హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ): ఆ యువకులంతా ఉన్నత చదువులు చదివినవాళ్లే.. సులభంగా డబ్బులు సంపాదించాలని బెట్టింగ్ స్టార్ట్ చేశారు.. పాకిస్థాన్ సూపర్లీగ్లోని 10 క్రికెట్ మ్యాచ్లపై కేవలం 13 రోజుల్లోనే రూ.20 కోట్ల బెట్టింగ్ నిర్వహించారు. వీరి వలలో పడి హైదరాబాద్, భీమవరానికి చెందిన ఎంతోమంది అమాయకులు బలయ్యారు. ఏపీకి చెందిన జీ సత్యపవన్కుమార్, సతీష్రాజు, సీహెచ్ త్రినాథ్, ఎన్ భాస్కర్, జే ప్రసాద్ నిజాంపేట పరిధి పావనీ రెసిడెన్సీలోని పెంట్హౌజ్ను అద్దెకు తీసుకొన్నారు. ఏపీకి చెందిన సోమన్న ద్వారా బెట్టింగ్ విధానాలు తెలుసుకొని దందా మొదలెట్టారు. ఒక్కో మ్యాచ్కు దాదాపు రూ.2 కోట్ల వరకు బెట్టింగ్లను నిర్వహించారు. ఇలా పందేలు నిర్వహిస్తూ మంగళవారం పోలీసులకు దొరికిపోయారు. వీరివద్ద పోలీసులు రూ.20.50 లక్షల నగదు స్వాధీనం చేసుకొన్నారు. నిందితుల బ్యాంకులు, ఇతర వ్యాలెట్లలో ఉన్న నగదును కూడా సీజ్ చేస్తామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ చెప్పారు.
తల్లిదండ్రులూ జరజాగ్రత్త
బెట్-365, డ్రీమ్-11, ఎంపీఎల్ బెట్వే, డ్రీమ్ గురు, మై 11 సర్కిల్, కోరల్, బ్విన్-777, డాఫాబెట్, విన్నర్, క్రికెట్ బెట్టింగ్ 2020, జస్ట్ బెట్, లోటస్ క్రికెట్ లైన్, బెట్ఫ్రెడ్ లాంటి యాప్లకు పిల్లలను దూరంగా ఉంచాలి.
బెట్టింగ్ ఉచ్చులోపడి చాలామంది యువకులు, పందెంరాయుళ్లు కుటుంబాలతో విబేధిస్తూ ఒంటరిగా ఉంటున్నారు.
ఏ పని చేయకుండా తరచుగా డబ్బులు అడుగుతుంటే ఇంట్లో వారైనా, అప్పులు ఇచ్చే వారైనా అనుమానించాలి.
ఈ యాప్ల ద్వారా క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడి లక్షలాది రూపాయలు పోగొట్టుకుని అప్పుల పాలవుతున్నారు. వాటిని తీర్చేందుకు ఆస్తులను అమ్ముకొంటున్నారు. చిన్న, చిన్న నేరాలకు పాల్పడుతున్నారు.
బెట్టింగ్ ముఠాలపై సమాచారం ఉంటే డయల్ 100 లేదా సైబరాబాద్ వాట్సాప్ నంబరు 9490617444కు సమాచారం ఇవ్వాలి.