మంచు విష్ణు హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘మోసగాళ్లు’. కాజల్, నవదీప్, నవీన్చంద్ర కీలక పాత్రల్ని పోషించారు. జెఫ్రీ గీ చిన్ దర్శకుడు. ఈ నెల 19న విడుదలకానుంది. ఆదివారం హైదరాబాద్లో పది నిమిషాల సినిమాను చిత్రబృందం ప్రదర్శించింది. ఈ సందర్భంగా హీరో, నిర్మాత మంచు విష్ణు మాట్లాడుతూ ‘కథపై నమ్మకంతోనే పది నిమిషాల సినిమాను అందరికి చూపించాం.తెలుగులో స్ట్రెయిట్గా, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అనువాద రూపంలో విడుదలచేయబోతున్నాం. పాన్ ఇండియన్ స్థాయిలో విడుదలవుతున్న నా తొలి సినిమా ఇది. ఈ సినిమా కోసం నేను దాచుకున్న మొత్తం డబ్బు ఖర్చుచేశా. నా గత చిత్రాల తరహాలో సాగే యాక్షన్ కామెడీ సినిమా కాదిది. నా ఇమేజ్కు భిన్నమైన ప్రయత్నంగా నిలుస్తుంది. యథార్థంగా జరిగిన కథతో తెరకెక్కించాం. అక్కాతమ్ముళ్లు పెద్ద స్కామ్ ఎందుకు చేశారు? ఆధారాలున్నా అమెరికన్ పోలీసులు వారిని ఎందుకు శిక్షించలేదు? చివరకు వారు నిర్ధోషులగా ఎలా బయటపడ్డారన్నది ఆసక్తిగా ఉంటుంది. ఇందులో నాకు సోదరిగా కాజల్ నటించింది. ప్రేక్షకుల్ని మోసం చేయకూడదనే మా పాత్రల మధ్య ఉన్న బంధాన్ని ముందుగానే వెల్లడించాం’ అని తెలిపారు. లాక్డౌన్ తర్వాత విడుదలవుతున్న సినిమాలన్నీ చక్కటి ఆదరణను సొంతం చేసుకుంటున్నాయని, వాటిలో ఒకటిగా ఈ సినిమా నిలుస్తుందని నవదీప్ అన్నారు.