న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీల ఎన్నికలతోపాటు 2024లో జరిగే లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోదీ తన క్యాబినెట్ను విస్తరించారు. బుధవారం జరిగిన క్యాబినెట్ విస్తరణలో ఉత్తరప్రదేశ్ నుంచి ఎనిమిది మందికి మంత్రి పదవులు లభించాయి. ప్రధాని నరేంద్రమోదీతోపాటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఉత్తరప్రదేశ్ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారే.
బీజేపీ భాగస్వామ్య పక్షం అప్నాదళ్ అధినేత్రి అనుప్రియా పటేల్ మినహా అందరూ బీజేపీ నుంచి పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహిస్తున్న వారే. పంకజ్ చౌదరి, డాక్టర్ సత్యపాల్ సింగ్ భాగెల్, భాను ప్రతాప్ సింగ్ వర్మ, కౌశల్ కిశోర్, బీఎల్ వర్మ, అజయ్ కుమార్ మిశ్రాలకు కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కింది.
ఇటీవలి ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో ఓటమి పాలైనా.. 2019 ఎన్నికల్లో పట్టు కొనసాగించేందుకు నలుగురికి కొత్తగా క్యాబినెట్లో చోటు కల్పించారు. నితీశ్ ప్రమాణిక్, జాన్ బార్లా, శంతను ఠాకూర్, డాక్టర్ సుభాష్ సర్కార్.. మంత్రులుగా చేరారు. ఇక పశ్చిమ బెంగాల్ పక్కనే ఉన్న త్రిపుర నుంచి ప్రతిమా భౌమిక్కు తాజాగా కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కింది.
మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో పట్టు ఉన్న శివసేనను లోక్సభ ఎన్నికల్లో ఢీకొట్టేందుకు వీలుగా నారాయణ్ రాణెకు చోటు కల్పించినట్లు తెలుస్తున్నది. ఆయనకు కీలక సూక్ష్మ చిన్న మద్య తరహా పరిశ్రమల శాఖను కేటాయించారు.
ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్ నుంచి మొత్తం ఆరుగురికి చోటు దక్కింది. అనుభవజ్ఞులు, యువకుల మేలు కలయికగా మోదీ కొత్త క్యాబినెట్ను అభివర్ణిస్తున్నారు. 13 మంది న్యాయవాదులు, ఆరుగురు డాక్టర్లు, ఐదుగురు ఇంజినీర్లు, ఏడుగురు మాజీ సివిల్ సర్వెంట్లు, ఏడుగురు పీహెచ్డీ, ముగ్గురు బిజినెస్ డిగ్రీ చేసిన వారు ఉన్నారు.
కర్ణాటక నుంచి ఆ రాష్ట్ర సీఎం యెడియూరప్పకు అత్యంత సన్నిహితురాలు శోభా కరంద్లాజేకు క్యాబినెట్లో చోటు దక్కింది. ఇంకా ఏ నారాయణ స్వామి, రాజీవ్ చంద్రశేఖర్, భగవంత్ కుబా తొలిసారి కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇప్పటి వరకు కేంద్ర మంత్రిగా ఉన్న సదానంద గౌడ రాజీనామా చేశారు.
అయితే, పలు శాఖల్లో సమూల మార్పులు చేసిన నాలుగు ప్రధాన శాఖల మంత్రులు మాత్రం యధాతథంగానే కొనసాగుతున్నారు. హోంశాఖ మంత్రి అమిత్షాకు అదనంగా సహకార శాఖను అప్పగించారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ శాఖ మంత్రిగా ఎస్ జై శంకర్, ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ కొనసాగుతున్నారు.