నిర్లక్ష్యం, అపరిశుభ్రతను సాకుగా చూపుతూ నగరంలోని పలు ప్రాంతాల్లోని ఇంటి ఓనర్లు బ్యాచ్లర్స్కు ఇంటిని అద్దెకు ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదు. యువకులు, బ్రహ్మచారుల కారణంగానే కొవిడ్ ప్రబలుతుందని ఇంట్లో కిరాయికి ఉండేవాళ్లను సైతం యజమానులు వెళ్లగొడుతున్నారు. ఫ్యామిలీ సభ్యులైతే అన్ని రకాలుగా భద్రంగా ఉంటారనే మీమాంసలో ఇల్లు గలవారు ఇండ్లండ్ల నుంచి బ్యాచ్లర్స్ను ఖాళీ చేయిస్తున్నారు. కరోనా కాలంతో బ్రహ్మచారులకు భలే కష్టం వచ్చింది.
“అది హిమాయత్నగర్లోని ఓ ఇల్లు. సింగిల్ బెడ్ రూం అద్దె రూ.7,500. నలుగురు స్నేహితులు ఉంటారు. తలా కొంత చెల్లించి నెల అద్దె కట్టేవారు. అయితే, ఇప్పుడు కరోనా కష్టాలు మొదలయ్యాయి. దీంతో ఇంటి యజమాని నలుగురికి బదులు ఇద్దరే ఉండాలని షరతులు విధించాడు. చేసేదేమీ లేక ఆ గది ఖాళీ చేసి మరో గదిలోకి మారారు. అయితే, అక్కడా అదే పరిస్థితి ఉండటంతో ఓ స్నేహితుడు మరో ప్రాంతంలోని స్నేహితుల గదిలోకి మారాల్సి వచ్చింది.”
“సికింద్రాబాద్లోని ఓ అపార్ట్మెంట్లో మూడో ఫ్లోర్ మొత్తం బ్యాచిలర్స్కే కేటాయించేవారు. కాని, ఇప్పుడు ఓన్లీ ఫ్యామిలీకే అంటూ బోర్డు పెట్టారు.” ఇలా నగరంలో చాలా ప్రాంతాల్లో బ్యాచిలర్స్కు గదులు అద్దెకు దొరకడం గగనమైంది. ఇద్దరికి మించి ఎక్కువ ఉండకూడదన్న షరతులు పెడుతున్నారు. కరోనా పరిస్థితుల్లో బ్యాచిలర్స్ రాకపోకలు రోజులో అధికంగా ఉంటాయని ఇంటి యజమానుల భావన. ‘ఏం కాదులే’ అనే ఓవర్ కాన్ఫిడెన్స్ అధికంగా ఉంటుందని రాజేశ్వర్ రెడ్డి అనే ఇంటి యజమాని తెలిపారు.
ఉప్పల్లోని ఓ అపార్ట్మెంట్లో ఐదుగురం కలిసి ఉంటున్నాం. అయితే, ఇక నుంచి ముగ్గురే ఉండాలని ఓనర్ చెప్పాడు. జన సంచారం ఎక్కువగా ఉన్న అపార్ట్మెంట్లలో కిరాయి గదులను బ్యాచిలర్స్కు ఇవ్వొద్దని తీర్మానం చేసుకుంటున్నారు. ప్రధానంగా బ్యాచిలర్స్ అంటే అన్నిటిని లైట్ తీసుకుంటారని, పరిశుభ్రదత విషయంలో సీరియస్ తీసుకోరని వారు అభిప్రాయపడుతుంటారు. కాని, వాళ్లు ఒకప్పుడు బ్యాచిలర్స్గా జీవించే వచ్చారనే విషయం మర్చిపోతున్నారు. చేసేదేమి లేక మిగిలిన ఇద్దరు స్నేహితులు ఈ ఏరియాలోనే మరో గదిని అద్దెకు తీసుకున్నారు. – నగేశ్, ఉప్పల్