న్యూఢిల్లీ : దేశంలో కరోనా మరణ మృదంగం మోగిస్తున్నది. రోజువారి కేసులు తగ్గుముఖం పడుతున్న.. మరణాలు మాత్రం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా వరుసగా మూడు రోజు కొవిడ్ కేసులు లక్షకు దిగువన నమోదవగా.. రికార్డు స్థాయిలో ఒకే రోజు 6,148 మరణాలు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి నుంచి ఇంత పెద్ద మొత్తంలో మరణాలు నమోదవడం ఇదే తొలిసారి. గడిచిన 24 గంటల్లో 94,052 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా 1,51,367 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారని పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,91,83,121కు చేరింది. ఇందులో 2,76,55,493 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్ బారినపడి ఇప్పటి వరకు 3,59,676 మంది ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం దేశంలో 11,67,952 యాక్టివ్ కేసులున్నాయని చెప్పింది. టీకా డ్రైవ్లో ఇప్పటి వరకు 23,90,58,360 డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది. అయితే, బిహార్ మరణాల డేటాను సవరించిన నేపథ్యంలో మృతుల సంఖ్య ఈ స్థాయిలో పెరిగినట్టు తెలుస్తోంది.