కొవిడ్ బారి నుంచి ప్రపంచాన్ని రక్షించాలని అబిడ్స్ ఇస్కాన్ మందిరం హాల్లో నరసింహ సుదర్శన యజ్ఞాన్ని నిరాడంబరంగా నిర్వహించారు. యేడాదిగా విజృంభిస్తున్న కోవిడ్ బారి నుంచి ప్రజలను రక్షించేందుకు గాను ఈ యజ్ఞాన్ని చేపట్టారు. ఇస్కాన్ హైదరాబాద్ టెంపుల్ మేనేజ్మెంట్ కౌన్సిల్ సభ్యులు వేదాంత చైతన్యదాస్ ఆధ్కర్యంలో యజ్ఞాన్ని నిర్వహించగా, పలువురు భక్తులు పాల్గొన్నారు. ఉదయం పదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు ఈ యజ్ఞం జరిగింది. ఇస్కాన్ వెబ్సైట్లో పేర్లను నమోదు చేసుకున్న వారి గోత్ర నామాలను చదివి యజ్ఞాన్ని నిర్వహించారు. మొదట పూజ నిర్వహించిన అనంతరం, యజ్ఞాన్ని ప్రారంభించారు. అనంతరం, పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేపట్టారు. నరసింహ స్తోత్రంలో యజ్ఞం ముగిసింది. ఈ సందర్భంగా ఇస్కాన్ ఆలయ కమిటీ సెక్రటరి శంభు వైష్ణవ దాస్ మాట్లాడుతూ కరోనా నుంచి ప్రజలను కాపాడాలని నరసింహ సుదర్శన యజ్ఞాన్ని చేపట్టినట్లు వివరించారు. కరోనా సెకండ్ వేవ్ పూర్తిగా తగ్గి అందరికి శుభాలు జరగాలని యజ్ఞం నిర్వహించినట్టు తెలిపారు.