వాహన కంపెనీలకు కేంద్రం షాక్
న్యూఢిల్లీ, మార్చి 17: ఆటోమొబైల్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. లోపభూయిష్టంగా తయారైన ఏ వాహనాలనైనా తప్పనిసరిగా రీకాల్ చేయాల్సి వస్తే ఆయా వాహన కంపెనీలు రూ.కోటి వరకు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి తయారయ్యే వాహనాలకు ఈ నియమం వర్తిస్తుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. లోపభూయిష్టంగా తయారైన వాహనాలను విధిగా రీకాల్ చేసేందుకు కంపెనీలు పాటించాల్సిన నిబంధనలను ఆ శాఖ జారీ చేసింది. ఏదైనా ప్రత్యేక క్యాటగిరీ కింద అమ్ముడుపోయిన ఒకే మోడల్ వాహనాలపై వెహికల్ రీకాల్ పోర్టల్కు కనీస సంఖ్యలో ఫిర్యాదులు వస్తే ఆయా వాహనాలను వెనక్కి రప్పించేందుకు సదరు కంపెనీలు విధిగా చర్యలు చేపట్టాల్సి ఉంటుందని తెలిపింది. అలాంటి సందర్భాల్లో ఆయా వాహనాల రకాలు, అప్పటివరకు అమ్ముడు పోయిన మొత్తం వాహనాల సంఖ్య ఆధారంగా వాటి తయారీదారులు లేదా దిగుమతిదారులు రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది