లాక్డౌన్తో ఉపాధి కోల్పోయిన పేదలకు స్వచ్ఛంద సంస్థల బాసట
నిత్యావసరాల అందజేత
పలుచోట్ల భోజనం పంపిణీ
విద్యానగర్, మే 18:లాక్డౌన్తో ఉపాధి కోల్పోయి దిక్కుతోచనిస్థితిలో చిక్కుకున్న అభాగ్యులకు స్వచ్ఛంద సంస్థలు ఆపన్నహస్తం అందిస్తున్నాయి. పొట్టచేతపట్టుకొని వచ్చిన వలసజీవుల ఆకలి తీరుస్తున్నాయి.. బస్సుల కోసం వచ్చి బస్టాండ్లో చిక్కుకున్న ప్రయాణికుల క్షుద్బాధను దూరం చేస్తున్నాయి.. రోడ్లవెంట, వీధుల్లో భిక్కుభిక్కుమంటూ బతుకులు వెళ్లదీస్తున్న యాచకుల కడుపునింపుతున్నాయి..
లాక్డౌన్తో ఉపాధి కోల్పో యి ఇబ్బందులు పడుతున్న వలస కూలీలు, అభాగ్యులకు ‘మేము సైతం యువసేన’ బాసటగా నిలుస్తున్నది. మంగళవారం నగరంలోని బోయవాడలో గల ఐదు నిరుపేద కుటుంబాలకు మంగళవారం బియ్యం బస్తాలు అందించినట్లు ఫౌండేషన్ అధ్యక్షురాలు చకిలం స్వప్న తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కష్టకాలంలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించడం ఆనందం గా ఉన్నదన్నారు. ఫౌండేషన్కు సహాయం చేస్తున్న లావణ్య-ప్రకాశ్వర్షకు కృతజ్ఞతలు తెలిపారు. గోపిశెట్టి శ్రీమన్య, శ్రీకర్, సాయిసిద్ధ ఉన్నారు.
రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో..
ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ కరీంనగర్ బ్రాంచ్ ఆధ్వర్యంలో చైర్మన్ కేశవరెడ్డి బా లసదన్లో మంగళవారం మాస్క్లు, సబ్బులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్క్రాస్ సొసైటీ సెక్రటరీ రా ధాకృష్ణారెడ్డి, కోల అన్నారెడ్డి, బాలసదన్ సూపరింటెండెంట్ సంతోష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ ప్రయాణికులకు అన్నదానం..
తెలంగాణచౌక్,మే18: బస్టాండ్లో చిక్కుకుపోయి న ప్రయాణికులకు మంగళవారం వికాస తరంగణి ఆధ్యాత్మిక సంస్థ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. రెండోరోజూ జీయర్ ఎడ్యుకేషన్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు ఎస్ ప్ర భాకర్రావు నేతృత్వంలో సుమారు 50 మందికి అన్నం, పప్పు, సాంబారు. మజ్జిగతో కూడిన భో జనాన్ని అందించారు. కార్యక్రమంలో డిపో1 మేనేజర్ అర్పిత పాల్గొన్నారు.
సేవా భారతి ఆధ్వర్యంలో ..
కరోనా బారినపడి హోమ్ ఐసోలేషన్లో ఉంటు న్న వారికి సేవాభారతి కరీనగర్ శాఖ అండగా నిలుస్తున్నది. మంగళవారం పలువురికి భోజనం అందించామని ట్రస్ట్ బాధ్యుడు అజయ్కుమార్ తెలిపారు. ఆహారం అవసరమున్నవారు ముందు రోజు సాయంత్రం 6లోగా 6304321501, 9381926592 నంబర్లలో సంప్రదించాలని కో రారు. వారు అందజేసిన అడ్రస్కు ఉదయం అల్ఫాహారం, మధ్యాహ్నం. రాత్రి భోజనాలను అందిస్తామని చెప్పారు.
ఉచితం.. అన్నపూర్ణ భోజనం
కార్పొరేషన్, మే 18: నగరంలో పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రూ. 5 అన్నపూర్ణ భోజన పథకాన్ని బుధవారం నుంచి ఉచితంగా నిర్వహిస్తామని నగర మేయర్ వై సునీల్రావు ఒక ప్రకటనలో తెలిపారు. లాక్డౌన్ విధించిన నేపథ్యంలో మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు వలసకూలీలు, పనిలేక ఆకలితో అలమటిస్తున్న నిరుపేదల కడుపు నింపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. నగరంలోని కళాభారతి, జిల్లా గ్రంథాలయం వద్ద గల క్యాంటిన్లలో ఇందుకు సంబంధించి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అభాగ్యులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.