కీవ్ : ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతున్న క్రమంలో తాజాగా జపరోజియా అణువిద్యుత్ ప్లాంట్పై మాస్కో సేనల దాడిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలదిమిర్ జెలెన్స్కీ స్పందించారు. రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు. చెర్నోబిల్ విధ్వంసాన్ని తిరిగి చేపట్టాలని రష్యా కోరుకుంటోందని అన్నారు. రష్యా బలగాలకు ఉక్రెయిన్ తలవంచితే తదుపరి బాల్టిక్ దేశాల వంతు వస్తుందని వ్యాఖ్యానించారు. యుద్ధాన్ని ముగించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్తో నేరుగా చర్చలు జరపడమే ఏకైక పరిష్కారమని అన్నారు.
మరోవైపు జపరోజియా అణువిద్యుత్ ప్లాంట్పై రష్యా దాడి నేపధ్యంలో జపాన్ ప్రధాని ఫుమియో కిషిదతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చర్చలు జరిపారు. మరోవైపు ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. కీలక నగరాలపై పట్టు బిగిస్తూ రష్యన్ సేనలు ఉక్రెయిన్పై విరుచుకుపడుతున్నాయి. అయితే రష్యా దమనకాండకు దీటుగా బదులిస్తున్నామని ఉక్రెయిన్ సాయుధ బలగాలు స్పష్టం చేశాయి.
ఇప్పటివరకూ 250 రష్యన్ ట్యాంకులను ధ్వంసం చేశామని, 10,000 మంది రష్యన్ సైనికులను మట్టుబెట్టామని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది.రష్యా వైపు భారీ నష్టం వాటిల్లిందని పేర్కొంది. 33 విమానాలు, 37 రష్యన్ హెలికాఫ్టర్లను కూల్చామని తెలిపింది. 939 సాయుధ క్యారియర్లను ధ్వంసం చేశామని, 60 ఫ్యూయల్ ట్యాంకులను పేల్చివేశామని, 18 యాంటీ ఎయిర్క్రాఫ్ట్ వార్ఫేర్ను ధ్వంసం చేశామని తెలిపింది. ఇక జపోరిజియా అణు శక్తి కేంద్రాన్ని రష్యా దళాలు స్వాధీనం చేసుకున్నట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.