కీవ్, మార్చి 5: ఉక్రెయిన్ గగనతలాన్ని ‘నో-ఫ్లై జోన్’గా ప్రకటించాలన్న తన అభ్యర్థనను తిరస్కరించిన నాటో కూటమిపై జెలెన్స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దేశంపై రష్యా బాంబుల వర్షం కురిపించేందుకు నాటో గ్రీన్సిగ్నల్ ఇచ్చిందని మండిపడ్డారు. ‘ఈరోజు నాటో సమావేశం జరిగింది. అదొక బలహీన గందరగోళ సమావేశం. ఈ సమావేశంలో ఒక విషయం స్పష్టమైంది. ఐరోపా స్వాతంత్య్రం కోసం జరుగుతున్న పోరాటాన్ని మొదటి లక్ష్యంగా ప్రతి ఒక్కరూ భావించరు. నో ఫ్లై జోన్ను ప్రకటించకుండా.. ఉక్రెయిన్ నగరాలు, గ్రామాలపై మరిన్ని బాంబులు కురిపించేందుకు నాటో నాయకత్వం రష్యాకు అనుమతులు ఇచ్చింది’ అని జెలెన్స్కీ పేర్కొన్నారు.
తాత్కాలికంగా కాల్పుల విరమణ
పౌరులు సురక్షితంగా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లేందుకు మరియుపోల్, వోల్నోవోఖ్ నగరాల్లో రష్యా కాలమానం ప్రకారం శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల(భారత్లో మధ్యాహ్నం 12.30 నుంచి సాయంత్రం 6.30) వరకు తాత్కాలికంగా కాల్పుల విమరణ ప్రకటించింది. అయితే రష్యా ఈ మేరకు సహకరించకుండా బాంబు దాడులు కొనసాగించిందని మరియుపోల్ డిప్యూటీ మేయర్ సెర్హీ ఓర్లోవ్ పేర్కొన్నారు. మరోవైపు మరియుపొల్ తీరప్రాంత సరిహద్దులు చేరుకొన్న రష్యా సేనలు చేరుకున్నాయి. అక్కడి అణువిద్యుత్తు ప్లాంట్ను స్వాధీనం చేసుకొనే దిశగా అడుగులు వేస్తున్నాయి. యుద్ధంలో ఇప్పటివరకూ 10 వేలమంది రష్యా సైనికులు మరణించారని ఉక్రెయిన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ పేర్కొన్నారు.
ఐరోపాలో సైబర్ దాడుల కలకలం
పారిస్, మార్చి 5: ఉక్రెయిన్ పరిణామాల నేపథ్యంలో సైబర్ దాడులు కలకలం రేపుతున్నాయి. శుక్రవారం ఐరోపా వ్యాప్తంగా వేలాది మంది వినియోగదారులకు ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. వారి కంప్యూటర్లు ఒక్కసారిగా ఆఫ్లైన్లోకి వెళ్లిపోయాయి. యూరప్లో జర్మనీ, ఫ్రాన్స్, హంగరీ, గ్రీస్, ఇటలీ, పోలాండ్ దేశాల్లోని తమ 40 వేల మంది సబ్స్ర్కైబర్లలో మూడింట ఒక వంతు వినియోగదారులపై ఈ ప్రభావం పడిందని బిగ్బ్లూ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసు కంపెనీ మాతృసంస్థ యుటెల్సాట్ ధ్రువీకరించింది. ఫ్రాన్స్లో తమ అనుబంధ సంస్థ నార్డ్నెట్ అందించే శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్లో 9 వేల మంది సబ్స్ర్కైబర్లు ఇబ్బంది పడినట్టు ఆరంజ్ సంస్థ వెల్లడించింది. ఐరోపాలోని ఇతర దేశాల్లో కూడా బుధవారం నెట్వర్క్ సేవలకు అంతరాయం ఏర్పడింది.