కీవ్, మార్చి 24: రష్యా తమపై రసాయనిక దాడులకు పాల్పడుతున్నదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. పౌరులపై పాస్ఫరస్ బాంబులను ప్రయోగిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు నాటో కూటమి సదస్సులో గురువారం ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. ‘ఈ ఉదయం మా పౌరులపై పాస్ఫరస్ బాంబులు ప్రయోగించారు. దీంతో చిన్నారులతో సహా ఎంతోమంది మృత్యువాతపడ్డారు. మా దేశాన్ని, ప్రజలను కాపాడుకోవడానికి మాకు సైనిక సహకారం కావాలి. రష్యా ఎలాగైతే పరిమితులు లేకుండా మాపై అన్ని ఆయుధాలను ప్రయోగిస్తున్నదో.. అలాంటి సహకారాన్ని నాటో అందించాలి. ఇప్పటికైనా మాకు సాయపడాలని అనిపించట్లేదా? ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన కూటమి అని నాటో నిరూపించుకునే సమయం వచ్చింది. మీకు ఉన్న వాటిలో ఒక్క శాతం ఆయుధాలను మాకివ్వండి చాలు. రష్యాకు మేమేంటో చూపిస్తాం’ అని పేర్కొన్నారు. మరోవైపు, నెలరోజులుగా సాగుతున్న యుద్ధంలో ఇప్పటివరకూ 1,035 మంది పౌరులు మరణించినట్టు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం (ఓహెచ్సీహెచ్ఆర్) గురువారం వెల్లడించింది.
ఉక్రెయిన్కు అమెరికా సాయం
ఉక్రెయిన్లో మానవతా సాయానికి ఒక బిలియన్ డాలర్ల ఆర్థిక తోడ్పాటుతో పాటు లక్షమంది ఉక్రెయిన్ శరణార్థులను దేశంలోకి అనుమతించడానికి నిర్ణయించినట్టు గురువారం అమెరికా ప్రకటించింది. మరోవైపు, మరియుపోల్ను మట్టడించిన రష్యా సేనలు 15 వేల మందికిపైగా పౌరులను అక్రమంగా తీసుకుపోయినట్టు స్థానిక అధికారులు ఆరోపించారు. ఓడరేవు నగరం బెర్డియాన్స్ సమీపంలో రష్యాకు చెందిన యుద్ధ నౌక ‘ఓర్స్’ను ధ్వంసం చేసినట్టు ఉక్రెయిన్ వెల్లడించింది. ఉక్రెయిన్పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ పదవి నుంచి వైదొలుగుతున్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ సలహాదారు చుబాయిస్ ప్రకటించారు.
నెలలో జరిగిన నష్టమిది
ఉక్రెయిన్– ఇండ్లను విడిచినవారు: కోటి మంది
మరణించినవారు: 1,035 మంది
ఆర్థిక నష్టం: రూ. 8.42 లక్షల కోట్లు
రష్యా- మరణాలు: 15,800 మంది సైనికులు (రష్యా ప్రకారం 500), నాశనమైన విమానాలు, ట్యాంకులు, వాహనాలు: 2,359