న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా మాంసం విక్రయించే అతిపెద్ద సంస్థ జేబీఎస్పై సైబర్ దాడి జరిగింది. దీంతో ఆ సంస్థ పనులు నిలిచిపోయాయి. అత్యాధునిక రీతిలో సైబర్ అటాక్ జరిగినట్లు అధికారులు తెలిపారు. జెబీఎస్ సంస్థలో ఉన్న అన్ని కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయి. ఆస్ట్రేలియా, కెనడా, అమెరికాలో .. జేబీఎస్ మాంస విక్రమ మార్కెట్లను మూసివేశారు. దీంతో వేల సంఖ్యలో కార్మికులపైన కూడా ప్రభావం పడింది. రష్యాకు చెందిన క్రిమినల్ గ్రూపు.. రాన్సమ్వేర్ వైరస్తో దాడి చేసి ఉంటారని కంపెనీ పేర్కొన్నది. సైబర్ దాడి గురించి వైట్హౌజ్లోనూ ఫిర్యాదు చేశారు. కంప్యూటర్లు హ్యాక్ చేయడం వల్ల మాంసం సరఫరాలో ఇబ్బందులు తలెత్తనున్నాయి. కొన్ని చోట్ల మీట్ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. రాన్సమ్వేర్ సైబర్ దాడితో.. హ్యాకర్లు కంప్యూటర్ నెట్వర్క్లోకి ప్రవేశించి కార్యకలాపాలను అడ్డుకుంటారు. ఫైల్స్ను డిలీట్ చేస్తారు. వాళ్లు అడిగిన మొత్తం ఇస్తేనే అప్పుడు దాడిని ఆపేస్తారు. ఈ ఘటన పట్ల ఎఫ్బీఐ విచారణ చేపట్టినట్లు శ్వేతసౌధం పేర్కొన్నది. రాన్సమ్వేర్ క్రిమినల్స్ విషయంలో రష్యాతో నేరుగా సంప్రదిస్తున్నట్లు వైట్హౌజ్ ప్రతినిధి కరీన్ జీన్ పెరీ తెలిపారు.
ప్రపంచంలో అతిపెద్ద మీట్ సప్లయర్గా జేబీఎస్ కంపెనీకి గుర్తింపు ఉన్నది. 15 దేశాల్లో ఆ కంపెనీకి 150 ప్లాంట్లు ఉన్నాయి. 1953లో బ్రెజిల్లో స్టార్ట్ చేశారు. జోస్ బటిస్టా సోబ్రినో అనే వ్యక్తి ఆ కంపెనీని మొదలుపెట్టారు. జేబీఎస్ కంపెనీలో ప్రస్తుతం లక్షా 50 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. సూపర్ మార్కెట్లు, మెక్డోనాల్డ్స్ లాంటి ఫాస్ట్ ఫుడ్ ఔట్లెట్ సంస్థలు దానికి కస్టమర్లుగా ఉన్నాయి. అమెరికాలో పావు వంతు బీఫ్ను ఈ సంస్థనే సరఫరా చేస్తుంది.