Aquarium explodes | జర్మనీలోని హోటల్లో ఉన్న అక్వేరియం పేలిపోయింది. లక్షల లీటర్ల నీటి ప్రవాహం ఒక్కసారిగా రావడంతో సునామీ వంటి పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన శుక్రవారం తెల్లవారు జామున 5.45 గంటలకు చోటుచేసుకున్నది. వేల సంఖ్యలో రకరకాల చేపలు చనిపోయాయి. పెద్ద ఎత్తున నీరు బయటకు రావడంతో హోటల్, దాని రహదారిని ముంచెత్తింది. సమాచారం అందిన వెంటనే 100 మంది అత్యవసర సేవల బృందం ఘటనాస్థలానికి చేరుకున్నది. కాగా, ఇదే ప్రపంచంలోని అతి పెద్ద అక్వేరియంగా పేరుగాంచింది.
జర్మనీ రాజధాని బెర్లిన్లోని రాడిసన్ బ్లూ హోటల్లో ప్రసిద్ధ అక్వేరియాం పేలింది. అక్వేరియం పేలుడు తర్వాత 2,64,172 గ్యాలన్ల నీరు హోటల్ పరిసరాలను ముంచెత్తింది. హోటల్ లాబీలో విస్తరించి ఉన్న ఈ అక్వేరియంలో 1,500 చేపలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అక్వేరియం పగిలిపోవడంతో అద్దాలు పడి ఇద్దరు గాయపడ్డారు. భారీ నష్టం వాటిల్లిందని బెర్లిన్ పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఇందుకోసం నిపుణుల సలహాలు కూడా తీసుకోనున్నారు. ఈ ఘటన తర్వాత చాలా మందిని హోటల్ నుంచి బయటకు తీసుకొచ్చారు. ఆక్వాడమ్ అక్వేరియం ఎత్తు 15.85 మీటర్లు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్థూపాకార అక్వేరియం.
అక్వేరియం పేలిన వెంటనే అక్కడ భూకంపం వచ్చినట్లు అనిపించిందని హోటల్లో బస చేసిన ఓ గెస్ట్ చెప్పారు. అక్వేరియంలోని చిన్న ట్యాంకుల్లో ఉంచిన చేపలను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెల్లవారుజామున ఎవరూ లేని సమయంలో అక్వేరియం పేలిందని బెర్లిన్ మేయర్ ఫ్రాంజిస్కా జిఫ్ఫ్ తెలిపారు. ఈ ఘటన మరే సమయంలోనైనా జరిగి ఉంటే చాలా మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉండేదని ఆయనన్నారు. ఘటన జరిగినప్పుడు హోటల్లో దాదాపు 350 మంది గెస్ట్లు ఉన్నట్లు సమాచారం.