వార్సా: రెండో ప్రపంచ యుద్ధం నాటి భారీ సమాధి ఒకటి పోలాండ్లో బయటపడింది. చోజ్నీస్ అనే పట్టణ శివార్లలో టన్నుల కొద్దీ మానవ ఎముకలు, అవశేషాలను పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. ‘డెత్ వ్యాలీ’గా పిలిచే ప్రాంతంలో దీనిని కనుగొన్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో పోలాండ్లో నాజీ యుద్ధ నేరాలకు సంబంధించిన ‘అతి ముఖ్యమైన ఆవిష్కరణలలో ఒకటి’ గా దీనిని చెబుతున్నారు. నాజీ సైనికులు సుమారు 500 మందిని చంపి ఇక్కడ పాతిపెట్టినట్లు క్షేత్ర నిఫుణులు అంచనావేశారు. పోలాండ్లోని పోమెరేనియా ప్రావిన్స్లో జరిగిన భయంకరమైన ‘పోమెరేనియన్ క్రైమ్’తో ఇది ముడిపడి ఉండవచ్చని భావిస్తున్నారు.
1939లో రెండవ ప్రపంచ యుద్ధం ఆరంభంలో జర్మనీ నియంత హిట్లర్కు చెందిన నాజీ ఆర్మీ పాల్పడిన మారణహోమాలను పోలాండ్లోని ‘డెత్ వ్యాలీ’ ప్రాంతం గుర్తుకు తెస్తున్నది. ఈ అటవీ ప్రాంతంలో సుమారు 35,000 మందికి సామూహిక మరణశిక్షలు అమలు చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. పోలాండ్ సైనికులు, ఇతరులను నాజీ సైనికులు తుపాకులతో కాల్చి చంపి ఇక్కడి గోతుల్లో పడేశారని, ఆధారాలు లభించకుండా కొందరి మృతదేహాలను దహనం చేశారని పురావస్తు పరిశోధకులు చెబుతున్నారు.
మరోవైపు ఈ భారీ మానవ సమాధిలో కొన్ని విలువైన వస్తువులు కూడా లభించాయి. పెండ్లి ఉంగరం, చెవిపోగులు, దెబ్బతిన్న గడియారం వంటి మరణించిన వారికి సంబంధించిన వాటిని కూడా వెలికితీశారు. ఫౌంటెన్ పెన్నులు, సిగరెట్ పెట్టెలు, గ్లాసులు, సంకెళ్లు, పాకెట్ బైబిల్ వంటివి కూడా ఇక్కడ లభించినట్లు పురావస్తు పరిశోధకులు తెలిపారు. కాగా, ఈ భారీ మానవ సమాధిని గత ఏడాడే కనుగొన్నారు. అయితే ఇటీవల తవ్వకాలు జరిపి అందులోని మానవ అవశేషాలు, వస్తువులను వెలికితీశారు.