న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన జీవన వ్యయ సంక్షోభం ఏర్పడినట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఈ సమస్య ఉత్పన్నమైటన్లు కూడా తన రిపోర్ట్లో అభిప్రాయపడింది. 21వ శతాబ్ధంలో ఎన్నడూలేని జీవన వ్యయ సంక్షోభం ఏర్పడిందని, ఆ పరిస్థితికి తట్టుకోలేని స్థితిలో ప్రజలు ఉన్నట్లు యూఎన్ తెలిపింది. ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఆ సమస్య మరింత తీవ్రమైనట్లు గ్లోబల్ క్రైసిస్ రెస్పాన్స్ గ్రూప్ ఆన్ ఫుడ్, ఎనర్జీ అండ్ ఫైనాన్స్ పేర్కొన్నది. ఉక్రెయిన్ సంక్షోభంలో ప్రజలు ఇరుక్కున్నారని, ఆహారం, ఇంధనం, ఫెర్టిలైజర్ మార్కెట్ ధరలను ప్రజలు ఎదుర్కోలేకపోతున్నట్లు యూఎన్ తన రిపోర్ట్లో చెప్పింది. ఇక కోవిడ్19, వాతావరణ మార్పులు లాంటి విపత్తులు ఉన్న సమయంలో ఈ సంకట కాలం రావడం శోచనీయమని యూఎన్ అభిప్రాయపడింది. ఇంత తీవ్ర స్థాయిలో సంక్షోభం విరుచుకుపడడం ఓ పెద్ద సవాల్ అని, ఇది చరిత్రాత్మకమైందని యూఎన్ తన రిపోర్ట్లో తెలిపింది.
ఆహార ధరల పట్టిక రికార్డు స్థాయిలో దూసుకువెళ్తోందని, గత ఏడాదితో పోలిస్తే 20.8 శాతం ప్రైస్ ఇండెక్స్ పెరిగినట్లు యూఎన్కు చెందిన ఎఫ్ఏవో తెలిపింది. ఇక యుద్ధం వల్ల ఇంధన ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయని పేర్కొన్నది. క్రూడాయిల్ బ్యారెల్ ధర 120 డాలర్లు దాటినట్లు ఆ రిపోర్ట్ తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 50 శాతం పెరిగింది. గడిచిన 20 ఏళ్లతో పోలిస్తే, ఫెర్టిలైజర్ల ధరలు రెండింతలు అయినట్లు యూఎన్ తన రిపోర్ట్లో పేర్కొన్నది. కోవిడ్ వల్ల సముద్ర రవాణా ఖర్చులు కూడా మూడింతలు పెరిగాయి. వడ్డీ రేట్లు పెరగడం, పెట్టుబడులు తగ్గడం వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పరిస్థితి దయనీయంగా ఉన్నట్లు రిపోర్ట్ తెలిపింది
డీజిల్, నేచురల్ గ్యాస్ ధరలు పెరగడం వల్ల.. ఫెర్టిలైజర్లు, రవాణా ఛార్జీలు అమితంగా పెరిగినట్లు అంచనా వేశారు. ఈ రెండు అంశాల వల్ల ఆహార ఉత్పత్తి ధర కూడా పెరిగినట్లు యూఎన్ తెలిపింది. దీని వల్ల ఆహార ఉత్పత్తి తగ్గుతుందని, తద్వారా వచ్చే సీజన్లో ఆహార ధరలు ఆకాశాన్ని అంటనున్నట్లు యూఎన్ తన రిపోర్ట్లో అభిప్రాయపడింది. కాస్ట్ ఆఫ్ లీవింగ్ సంక్షోభం వల్ల సామాజిక, రాజకీయ అస్థిరత కూడా పెరగనున్నట్లు వార్నింగ్ ఇచ్చారు. ఈ విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు మార్కెట్ను మరింత దృఢంగా మార్చాలని, వస్తువుల ధరల్ని నియంత్రించాలని యూఎన్ తన రిపోర్ట్లో సూచించింది. అందుబాటు ధరలో ప్రజలందరికీ ప్రభుత్వాలు ఆహారాన్ని అందించాలని యూఎన్ కోరింది. ఉక్రెయిన్ ఆహార ఉత్పత్తులు, రష్యా ఫైర్టిలైర్లను మళ్లీ ఏకీకృతం చేస్తేనే ఆహార సంక్షోభానికి పరిష్కారం దొరుకుతుందని యూఎన్ తెలిపింది.
అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరిస్తేనే కాస్ట్ ఆఫ్ లీవింగ్ విపత్తును ఎదుర్కొనే అవకాశం ఉంటుందని రిపోర్ట్లో అభిప్రాయపడ్డారు. ప్రజల ఖర్చు సమస్యను పరిష్కరించాలంటే అనేక రకాల కార్యాచారణలు అవసరమని, తక్షణమే ఆ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ తెలిపారు.