వాషింగ్టన్: దేవుడిపై తన నమ్మకాన్ని పరీక్షించేందుకు ఒక మహిళ రోడ్డు క్రాసింగ్లోని రెడ్ సిగ్నల్ వద్ద కారు స్టీరింగ్ వదిలేసింది. దీంతో 190 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన ఆ కారు మరో కారును రాసుకుంటూ వెళ్లి అదుపుతప్పి పోల్ను ఢీకొట్టి సమీపంలోని ఒక ఇంట్లోకి దూసుకెళ్లింది. అదృష్టం బాగుండటంతో కారులో ఉన్న ఆ మహిళతోపాటు ఆమె కుమార్తె స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అమెరికా ఒహియోలోని బీచ్వుడ్ ప్రాంతంలో జూన్ 15న ఈ ఘటన జరిగింది. 31 ఏండ్ల మహిళ తన 11 ఏండ్ల కుమార్తెతో కలిసి కారు డ్రైవ్ చేస్తున్నది. ఒక జంక్షన్ వద్దకు రాగా ‘దేవుడా స్టీరింగ్ తీసుకో’ అని కారు స్టీరింగ్ పైనుంచి చేతులు తీసిన ఆమె కారు వేగం పెంచింది. దీంతో ఆ కారు రెడ్ లైట్ సిగ్నల్ను జంప్ చేసి మరో రోడ్డుపై వెళ్తున్న కారును వేగంగా రాసుకుంటూ వెళ్లింది. ఈ ఘటనతో అదుపుతప్పిన కారు ఒక పోల్ను ఢీకొనడంతోపాటు సమీపంలోని ఒక ఇంటిలోకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో ఆ మహిళతోపాటు ముందు సీటులో కూర్చొన్న ఆమె కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఆ మహిళ మద్యం సేవించలేదని, మత్తులో లేదని దర్యాప్తులో తేలింది. ప్రమాదంపై ఆ మహిళను ఆరా తీయగా దేవుడిపై తన నమ్మకాన్ని పరీక్షించేందకు కారు స్టీరింగ్ను వదిలేసినట్లు ఆమె చెప్పింది. తాను చేసిన పని కరెక్టేనని ఆమె సమర్థించుకున్నది. దీంతో ఆ మహిళపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా ట్రాఫిక్ జంక్షన్ వద్ద ఉన్న సీసీటీవీలో ఈ ఘటన రికార్డైంది.