Woman Journalist | ఇమ్రాన్ఖాన్ చేపట్టిన నిరసన ర్యాలీలో విషాదం చోటుచేసుకున్నది. షాబాజ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన లాంగ్ మార్చ్ను కవర్ చేసేందుకు వచ్చిన ఓ మహిళా జర్నలిస్ట్.. కంటైనర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలు ఛానల్ 5 రిపోర్టర్ సదాఫ్ నయీమ్గా గుర్తించారు. అంతకు గంట ముందే ఆమె ఇమ్రాన్ఖాన్ను కూడా ఇంటర్వ్యూ చేసింది.
పాకిస్తాన్లో షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో లాంగ్ మార్చ్ నిర్వహించారు. ఇమ్రాన్ ఖాన్ నిలుచుని ఉండి ప్రజలకు అభివాదం చేసేందుకు, ప్రసంగించేందుకు కంటైనర్ వాహనాన్ని పార్టీ నేతలు సమకూర్చారు. లాంగ్ మార్చ్ జరుగుతుండగా కంటైనర్పై ఉన్న జర్నలిస్ట్ సదాఫ్ నయీమ్ను వెనుక నుంచి ఎవరో తాకడంతో కిందపడిపోయింది. ఈ క్రమంలో ఆమె మెడపై నుంచి కంటైనర్ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది.
షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం దిగిపోవాలని డిమాండ్ చేస్తూ ఇమ్రాన్ ఖాన్ లాంగ్ మార్చ్ చేపట్టారు. శుక్రవారం లాహోర్లో ప్రారంభించిన ఈ లాంగ్ మార్చ్ నవంబర్ 4 వ తేదీన ఇస్లామాబాద్లో ముగియనున్నది. ఈ సంఘటన తర్వాత ఇమ్రాన్ ఖాన్ తన లాంగ్ మార్చ్ను ఒకరోజు విరమించుకున్నారు. మహిళా జర్నలిస్టు సదాఫ్ మరణం ఎంతో విషాదకరమైనదని ఇమ్రాన్ఖాన్ ఈ సందర్భంగా ఆమెకు నివాళులర్పించారు. సరిగ్గా ఒక్క రోజు క్రితం ఇమ్రాన్ఖాన్ను ఆమె ఇంటర్వ్యూ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా, మహిళా జర్నలిస్టు మృతిపై పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ విచారం వ్యక్తం చేశారు.