పాకిస్థాన్లో సార్వత్రిక ఎన్నికల తరువాత ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఏ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్ 134, అంటే మెజారిటీని సాధించలేకపోయింది. నాలుగు రోజులు గడుస్తున్నా ఎన్నికల సంఘం ఇంకా అధికారికంగా ఫలితాలను ప్రకటించలేదు. కాగా సంకీర్ణ ప్రభుత్వం కోసం వివిధ పార్టీల నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
నవాజ్ షరీఫ్ పార్టీ PML-N అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్ ఆదివారం రాత్రి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (PPP) నాయకుడు ఆసిఫ్ అలీ జర్దారీ, అతని కుమారుడు బిలావల్ భట్టోను కలిశారు. అనంతరం పీపీపీ సోమవారం జరిగే తమ పార్టీ కేంద్ర కార్యవర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. ప్రధాని పదవి కావాలని భుట్టో డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం.
మరోవైపు ఇమ్రాన్ఖాన్ పార్టీ పీటీఐ కూడా ప్రయత్నాలు మొదలు పెట్టింది. పీటీఐ గుర్తును కోర్టు బ్యాన్ చేయడంతో ఆ పార్టీ మద్దతుదారులతంతా ఇండిపెండెంట్లుగా పోటీ చేశారు. అత్యధికంగా 101 స్థానాల్లో గెలుపొందారు. ప్రజా తీర్పును గౌరవించి తమ పార్టీనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని పీటీఐ కోరుతున్నది. కానీ.. ఇది సాధ్యమయ్యేలా లేదు. ఇండిపెండెంట్లుగా గెలిచన అభ్యర్థులంతా తిరిగి పీటీఐలో చేరి అంతర్గత ఎన్నికలు నిర్వహించుకొని తిరిగి పార్టీ గుర్తు(క్రికెట్బ్యాట్)ను పొందాలి.
ఈలోగా 54 సీట్లు గెలిచిన పీపీపీ ఇతర చిన్నపార్టీలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నది. 75 సీట్లు గెలిచిన నవాజ్ షరీఫ్ పార్టీ పీఎంఎల్-ఎన్ కూడా సర్కారు ఏర్పాటుకు మంతనాలు చేస్తున్నది. పీపీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లు ఉన్నాయి. వీటిలో 265 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఒక స్థానానికి ఫలితాలు ప్రకటించలేదు. మిగిలిన 70 సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి. ఇవి నామినేటెడ్ సీట్టు. మహిళలను, మతపరమైన మైనారీటీలను నామినేట్ చేస్తారు.