బీజింగ్: చైనాలో కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్ నిబంధనలు 10 మంది ప్రాణాలు తీశాయి. అక్కడ కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో నిబంధనలను కఠినతరం చేశారు. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో అయితే జనం ఇండ్ల నుంచి బయటికి రాకుండా గేట్లకు బయటి నుంచి తాళాలు వేస్తున్నారు.
చైనాలోని గ్జింజియాంగ్ ప్రావిన్స్ రాజధాని ఉరుమ్ఖ్వీలో కూడా కరోనా మహమ్మారి కలకలం రేపుతున్నది. దాంతో లాక్డౌన్ నిబంధనల్లో భాగంగా స్థానిక అధికారులు.. జనం బయటికి రాకుండా వివిధ నివాస సముదాయాల గేట్లకు తాళాలు వేశారు. ఈ క్రమంలో ఉరుమ్ఖ్వీ సిటీలోని తియాన్షాన్ జిల్లాలోని ఓ రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో గత గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
ప్రమాదాన్ని గమనించి జనం ఇండ్ల నుంచి బయటికి వచ్చేందుకు ప్రయత్నించగా ఎక్కడికక్కడ తాళాలు వేయడంతో కుదరలేదు. దాంతో చూస్తుండగానే మంటలు భవనం అంతటా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 10 మంది సజీవ దహనమయ్యారు. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. లాక్డౌన్ కారణంగా బిల్డింగ్ చుట్టూ కార్లు పార్క్చేసి ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్కు ఆటంకంగా మారింది. ఆలస్యం జరిగి ఉండకపోతే మరికొందరి ప్రాణాలైనా దక్కేవని స్థానికులు చెబుతున్నారు.