శ్రీలంక పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. ఈ నేపథ్యంలో నూతనంగా ప్రధాని పగ్గాలు చేపట్టిన రణీల్ విక్రమ సింఘే సోమవారం కీలక ప్రకటన చేశారు.ఒక్క రోజుకు మాత్రమే సరిపోయే పెట్రో నిల్వలు దేశంలో వున్నాయని ప్రకటించారు. డీజిల్ కొరత కూడా వున్నా.. ఈ మధ్య సరిపోతోందని, అయినా ఆ నిల్వలు ఏ మూలకూ సరిపోవని నిర్మొహమాటంగానే ప్రకటించారు.
ప్రస్తుతం దేశం విపత్కర పరిస్థితుల ముందు నిలబడిందని, దేశాన్ని సురక్షితంగా ఒడ్డుకు చేర్చే పనే తన ప్రథమ కర్తవ్యమని ప్రధాని విక్రమ సింఘే ప్రకటించారు. ఇప్పుడున్న ఆర్థిక కష్టాలను అధిగమించాలంటే 75 మిలియన్ డాలర్లు అవసరమని పేర్కొన్నారు. ఇక… శ్రీలంక ఎయిర్ లైన్స్ను ప్రైవేటీకరణ చేస్తున్నట్లు ప్రకటించారు.
ప్రస్తుతమున్న ఆర్థిక సవాళ్లను అధిగమించడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు. అయితే.. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్కు ప్రత్యామ్నాయంగా తాము కొత్త బడ్జెట్ను ప్రవేశపెడతామని ప్రకటించారు. 2019 లో విదేశీ మారకంలో 7.5 బిలియన్ డాలర్ల నిధులుండేవని, ఇప్పుడు ఖజానాలో ఒక్క మిలియన్ డాలర్లు కూడా లేని అధ్వాన్న స్థితిలో ఉండిపోయామని అన్నారు. గ్యాస్ను దిగుమతి చేసుకోవాలంటేనే 5 మిలియన్ డాలర్లు అవసరమవుతాయని ప్రజల దృష్టికి తెచ్చారు.
ప్రస్తుతం 3,200 బిలియన్ల అప్పు తీసుకోడానికి కేబినెట్ ఆమోదం ఉందని, మే రెండో వారం కల్లా దానిలో 1950 బిలియన్లు ఖర్చయ్యాయని తెలిపారు. దీంతో 1250 బిలియన్లు మాత్రం మిగిలాయని వెల్లడించారు. అందుకే ఈ అప్పుల పరిమితిని 3 వేల బిలియన్ల నుంచి 4 వేల బిలియన్ల వరకు పెంచడానికి పార్లమెంట్ ముందు ఓ ప్రతిపాదన పెడుతున్నట్లు విక్రమ సింఘే వెల్లడించారు.
చమురు ద్వారానే అధికంగా కరెంట్ ఉత్పత్తి జరుగుతోందని, అందుకే ఇకపై 15 గంటల వరకూ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ప్రధాని ప్రకటించారు. అయితే విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించేందుకు నిధుల సమీకరణ జరుగుతోందని శ్రీలంక ప్రధాని విక్రమ సింఘే పేర్కొన్నారు.