లండన్: కరోనా మహమ్మారి వేళ కూడా ప్రపంచంలోని సంపన్నుల జాబితాలో ఉన్న టాప్ పది మంది సంపద రెట్టింపు అయినట్లు ఆక్స్ఫామ్ సంస్థ తన రిపోర్ట్లో తెలిపింది. మహమ్మారి కరోనా విజృంభిస్తున్న సమయంలో ఒకవైపు పేదరికం, అసమానతలు పెరుగుతుండగా, మరో వైపు పది మంది సంపన్నుల ఆస్తులు మాత్రం దూసుకువెళ్లినట్లు చెప్పింది. ఆ సంపన్నులకు చెందిన సుమారు 700 బిలియన్ల డాలర్ల సంపద.. సుమారు 1.5 ట్రిలియన్ డాలర్లుగా రెట్టింపు అయినట్లు ఆక్స్ఫామ్ వెల్లడించింది. రోజూ సగటున 1.3 బిలియన్ల డాలర్ల చొప్పున ఆ పది మంది ఆస్తులు పెరిగినట్లు ఆ సంస్థ అంచనా వేసింది.
ఫోర్బ్స్ టాప్ టెన్ సంపన్నుల జాబితాలో టెస్లా చీఫ్ ఎలన్ మస్క్, అమెజాన్ చీఫ్ జెఫ్ బేజోస్, గూగుల్ వ్యవస్థాపకుడు లారీ పేజ్, సెర్గే బ్రిన్, ఫేస్బుక్ సీఈవో మార్క్ జూకర్బర్గ్, మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో బిల్ గేట్స్, స్టీవ్ బాల్మర్, ఒరాకిల్ సీఈవో లారీ ఎలిసన్, ఇన్వెస్టర్ వారెన్ బఫెట్, లగ్జరీ గ్రూపు ఎల్వీఎంహెచ్ అధినేత బెర్నార్డ్లు ఉన్నారు. పేదరిక నిర్మూలన కోసం ఆక్స్ఫామ్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తోంది. అయితే బిలీయనీర్ల ఆస్తులు గడిచిన 14 ఏళ్లతో పోలిస్తే.. కరోనా మహమ్మారి వేళ అధికంగా రెట్టింపు అయినట్లు ఆ సంస్థ చెప్పింది.
ఈ అసమానతలు ఆర్థిక హింసకు దారి తీస్తుందని ఆక్స్ఫామ్ తెలిపింది. దీని వల్ల రోజుకు సుమారు 21వేల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు ఆ సంస్థ పేర్కొన్నది. ఆరోగ్య సేవలు అందకపోవడం, లింగ వివక్ష నేరాలకు, ఆకలి, వాతావరణ మార్పులతో ఈ మరణాలు సంభవిస్తున్నట్లు ఆక్స్ఫామ్ అభిప్రాయపడింది. కరోనా మహమ్మారి వల్ల గత రెండేళ్లలో సుమారు 160 మిలియన్ల మంది పేదరికంలోకి వెళ్లినట్లు ఆ సంస్థ తెలిపింది. దీంట్లో ఎక్కువగా మైనార్టీలు ఉన్నట్లు చెప్పింది. 2021 డిసెంబర్లో ఆక్స్ఫామ్ సంస్థ సంపన్నుల ఆదాయంపై స్టడీ చేసింది. వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచేందుకు ప్రపంచవ్యాప్తంగా పన్ను సంస్కరణలు చేపట్టాలని ఆక్స్ఫామ్ కోరింది.