వాషింగ్టన్: కాబూల్ విమానాశ్రయంలో పేలుళ్లకు కారకులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. పేలుళ్లలో మృతిచెందిన అమెరికా సైనికులను హీరోలుగా అభివర్ణించారు. ఉగ్రమూకలను వేటాడి మరీ ప్రతీకారం తీర్చుకుంటామని, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు. ఐఎస్ఐఎస్ నాయకులను హతమార్చాలని అమెరికన్ ఆర్మీని ఆదేశించారు.
‘కాబుల్ ఎయిర్పోర్టులో జరిగిన పేలుళ్లలో మృతిచెందిన అమెరికా సైనికులు హీరోలు. ఈ ఘటనకు కారకులైన వారిని వదిలిపెట్టం. వారిని క్షమించం. వేటాడి మరీ ప్రతీకారం తీర్చుకుంటాం. ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా పౌరులను తరలిస్తాం. మా మిషన్ కొనసాగుతుంది. కాబూల్ దాడి వెనక తాలిబన్లు, ఐసిస్ కుట్ర ఉన్నట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు’ అని జో బైడెన్ ప్రకటించారు.
‘ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు అమెరికా.. తన ప్రాణాలను ఫణంగా పెట్టింది. తాము ప్రమాదకర మిషన్ను కొనసాగిస్తున్నాం. బాంబు దాడులు జరిగినా కాబుల్ నుంచి తరలింపు ప్రక్రియ ఆగదు. ఈనెల 31 నాటికి తమ బలగాలను ఉపసంహరించుకుంటాం. కాబుల్ పేలుళ్ల ఘటనలో కనీసం 72 మంది మృతి చెందారు. వారిలో 12 మంది అమెరికా సైనికులు ఉన్నారు’ అని చెప్పారు.
తాలిబన్ల ఆక్రమణలోకి వెళ్లి పట్టుమని పదిరోజులు కూడా కాకుండానే అఫ్గానిస్థాన్లో నెత్తుటేర్లు పారాయి. గురువారం సాయంత్రం బాంబు దాడులతో కాబూల్ దద్దరిల్లిన విషయం తెలిసిందే. ఉగ్ర దాడితో హమీద్ కర్జాయ్ విమానాశ్రయం రక్తసిక్తమైంది. ఎయిర్పోర్ట్లోని ‘అబే’ గేట్, విమానాశ్రయం ఆవరణలోని బారోన్ హోటల్ వద్ద వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో కనీసం 72 మంది మరణించారు. వందల మంది గాయపడ్డారు. మృతుల్లో పిల్లలు, విదేశీయులతో పాటు 12 మంది అమెరికా సైనికులు, తాలిబన్లు కూడా ఉన్నట్టు స్థానిక మీడియా పేర్కొంది. కాగా, బాంబు పేలుళ్లు తామే జరిపినట్లు టెర్రరిస్ట్ గ్రూప్ ఐఎస్ఐఎస్-కే ప్రకటించింది.