జనీవా: వెంటనే కాల్పులను విరమించాలని రష్యా, ఉక్రెయిన్కు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ పిలుపునిచ్చింది. గరిష్ఠ సంయమనం పాటించాలని, చర్చలను ప్రారంభించాలని సూచించింది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 11వ అత్యవసర ప్రత్యేక సమావేశం సోమవారం జరిగింది. ఈ దాడిలో మరణించిన వారికి నివాళిగా ఒక నిమిషం మౌనం పాటించింది. ఇరు పక్షాలు వెంటనే కాల్పులు విరమించాలని, దౌత్యం, చర్చలు కొనసాగాలని ఐరాస జనరల్ అసెంబ్లీ ఆకాంక్షించింది.
కాగా, ఈ యుద్ధం వల్ల పెరుగుతున్న హింస పౌరుల మరణాలకు దారి తీస్తున్నదని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక దానికి ముగింపు పలకాలని హితవు పలికారు. సైనికులు తిరిగి బ్యారక్లకు వెళ్లాలని, పౌరులకు రక్షణ కల్పించాలని సూచించారు. మానవతా సహాయం చాలా ముఖ్యమైనప్పటికీ సమస్యకు అది పరిష్కారం కాదన్నారు. శాంతి ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. ఉక్రెయిన్కు అన్ని విధాలా అండగా ఉంటామని ఆ దేశ అధ్యక్షుడికి హామీ ఇచ్చారు. వారికి మానవతా సహాయం అందిస్తానని చెప్పారు.