తాను ఎవరి దగ్గరా తలవంచే ప్రసక్తే లేదని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. అలాగే పాకిస్తాన్ సమాజాన్ని కూడా ఎక్కడా తలవంచనీయని హామీ ఇచ్చారు. తన ప్రభుత్వాన్ని కూల్చడానికి కొన్ని విదేశీ శక్తులు కుట్రలు పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు. ఇమ్రాన్ గద్దె దిగిపోతే పాక్ ప్రజల్ని తాము క్షమిస్తామని తమకు విదేశాల నుంచి కొన్ని మెసేజ్లు వస్తున్నాయని సంచలన ఆరోపణలకు దిగారు. తమ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి తెర వెనుక ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయని ఇమ్రాన్ అన్నారు. పాకిస్తాన్ ప్రజలు ఓ నిర్ణయం తీసుకునే రోజు వచ్చేసిందని పేర్కొన్నారు. ఉగ్రవాదానికి తమ దేశం పూర్తి వ్యతిరేకమని పేర్కొన్నారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురువారం జాతినుద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పాకిస్తాన్కు ఓ స్వతంత్ర విదేశాంగ విధానం ఉండాలన్నదే తన అభిమతమని, భారత్తో సహా, ఏ దేశంతోనూ విరోధం పెట్టుకోనని కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ హిందూ వ్యతిరేక దేశం కాకూడదన్నదే తన అభిమతమన్నారు. అమెరికాను గట్టిగా సమర్థించి, పర్వేజ్ ముషార్రఫ్ పెద్ద తప్పిదమే చేశారని ఇమ్రాన్ విమర్శించారు. అమెరికాతో పాటు, ఇండియాలో కూడా తనకు మంచి స్నేహితులు ఉన్నారని, వారితో వ్యక్తిగత విరోధం లేదని, కేవలం విధానపరమైన భేదాలే ఉన్నాయని ఇమ్రాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాజీనామా చేయను.. చివరి బంతి వరకూ ఆడతా.. .
ప్రధాని పదవికి రాజీనామా చేయమని కొందరు తనపై ఒత్తిడి తెచ్చారని పరోక్షంగా ఆర్మీ చీఫ్పై ఇమ్రాన్ మండిపడ్డారు. అసలు ఎందుకు రాజీనామా చేయాలి? అంటూ సూటిగా ప్రశ్నించారు. 20 సంవత్సరాల పాటు క్రికెట్ జీవితంలో ఉన్నానని, తాను చివరి బంతి వరకూ ఆడుతూనే వుంటానని చాలా మందికి తెలుసని కీలక వ్యాఖ్యలు చేశారు. జీవితంలో తానెప్పుడూ ఓటమిని అంగీకరించలేదని అన్నారు.
అవిశ్వాస తీర్మాన సమయంలో ప్రజలు అన్నీ చూస్తారని, ఎవరు తమ తమ అంతర్మాతలను అమ్మేసుకున్నారని కూడా తెలుస్తుందన్నారు. ఎక్కడైనా ప్రజా ప్రతినిధులు డబ్బులకు అమ్ముడు పోతారా? ఇదేనా పాక్ యువతకు ఇస్తున్న సందేశం? అంటూ ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. అలాంటి వారిని ప్రజలు ఏమాత్రం క్షమించరని ఇమ్రాన్ హెచ్చరించారు.
#WATCH | Islamabad: In his address to the nation, Pakistan Prime Minister Imran Khan claims that a foreign nation sent a message to them (Pakistan) that Imran Khan needs to be removed else Pakistan will suffer consequences. pic.twitter.com/aTGUh9HqSe
— ANI (@ANI) March 31, 2022
తాను రాజకీయాల్లోకి వచ్చి 25 సంవత్సరాలు గడిచాయని, న్యాయం, మానత్వం, ఆత్మాభిమానం.. ఈ మూడు అంశాలనే మేనిఫెస్టోగా ముందు పెట్టుకొని రాజకీయాల్లోకి అడుగుపెట్టినట్లు ఇమ్రాన్ వివరించారు. తన చిన్నతనంలో పాకిస్తాన్ బాగా ఎదిగిన దేశంగా ఉండేదని, సౌత్ కొరియా లాంటి దేశాలు పాక్ వద్ద పాఠాలు నేర్చుకునేవని అన్నారు. మలేశియా రాణులు కూడా తనతో కలిసి చదువుకున్నారని, మధ్య ఆసియా వారు పాక్ యూనివర్శిటీలకు వచ్చేవారని గుర్తు చేసుకున్నారు. ఇంత ఘనమైన చరిత్రను చూశానని, అలాగే అధః పాతాళంలోకి వచ్చిన పాక్ను కూడా చూశానని అన్నారు.
ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చా : ఇమ్రాన్
తనకు దేవుడు అన్నీ ఇచ్చాడని, తానెంతో అదృష్టవంతుడినని ఇమ్రాన్ చెప్పుకొచ్చారు. అయితే ప్రజలకు సేవ చేయడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. సంపద, ఆరోగ్యం… ఇలా దేవుడు అన్నీ ఇచ్చాడని ఇమ్రాన్ అన్నారు. పాకిస్తాన్ పెద్దల విజన్ ఎలా వుంటుంది? దానిని ఆవిష్కరించడానికి, ప్రజలకు వివరించడానికే రాజకీయాల్లోకి వచ్చానని వివరించారు. రాజకీయాల్లోకి వచ్చే ముందు, వచ్చే సమయంలో తనకు ఎలాంటి ఇబ్బందులూ లేవని, దేవుడు అన్నీ సమకూర్చి ఇచ్చారని, తనపై నమ్మకం ఉంచాడని అన్నారు.
పాకిస్తాన్కు ఎప్పుడైనా ధన్యవాదాలు చెప్పారా? ఇమ్రాన్
పాకిస్తాన్ అమెరికాతో ఎంతో స్నేహంగా ఉంటుందని కొందరు అంటుంటారని ఇమ్రాన్ అన్నారు. చాలా మంది పాక్ పౌరులు తమ సర్వస్వాన్నీ ధారబోశారని, అయినా.. పాకిస్తాన్కు ఎవరైనా ధన్యవాదాలు చెప్పారా? అంటూ ఇమ్రాన్ సూటిగా ప్రశ్నించారు. డ్రోన్ల దాడిలో అనేక మంది పాక్ పౌరులు మరణించారని ఇమ్రాన్ గుర్తు చేశారు.