South Korea : ఉత్తర కొరియా (North Korea) సైన్యం తమ సరిహద్దుల్లోకి ప్రవేశించడంతో తాము హెచ్చరిక కాల్పులు జరిపినట్లు దక్షిణ కొరియా (South Korea) వెల్లడించింది. సరిహద్దులోని తూర్పు భూభాగంలో కిమ్ సైన్యం ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపించింది. ఈ క్రమంలో ఉత్తర కొరియాకు హెచ్చరికలు చేయడంతోపాటు వార్నింగ్ షాట్లు ఇచ్చామని తెలిపింది. వార్నింగ్ షాట్స్తో 10 మంది కిమ్ సైనికులు తిరిగి వారి భూభాగంలోకి వెళ్లిపోయారని పేర్కొంది. ఉత్తర కొరియా కార్యకలాపాలను నిశితంగా గమనిస్తున్నామని వెల్లడించింది.
ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య ఉన్న సైనికరహిత ప్రాంతంలో ఉల్లంఘనలు తరచూ వెలుగు చూస్తూనే ఉన్నాయి. గత జూన్లో కూడా కిమ్ సైన్యం సరిహద్దు ఉల్లంఘనకు పాల్పడింది. అయితే శతృ సైన్యం ఉద్దేశపూర్వకంగా చొరబడలేదని దక్షిణ కొరియా అధికారులు ధ్రువీకరించడంతో ఎటువంటి ఉద్రిక్తతలు తలెత్తలేదు. ఇక తాజా చొరబాటు వెనుక ఉద్దేశంపై మాత్రం స్పష్టత రాలేదు.
ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు సాయం చేస్తున్న ఉత్తర కొరియా అటు అణ్వాయుధ ప్రయోగాలను ముమ్మరంగా కొనసాగిస్తూనే ఉంది. అణు నిరాయుధీకరణ చర్చలను పునఃప్రారంభించాలని అమెరికా, దక్షిణ కొరియాలు పిలుపునిస్తున్నప్పటికీ కిమ్ మాత్రం వాటిని పెడచెవిన పెడుతున్నాడు. మరోవైపు కిమ్ తనకు మిత్రుడని, దౌత్యసంబంధాలు మెరుగుపరిచేందుకు ఆయనతో భేటీ కావడానికి సిద్ధంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నప్పటికీ ఉత్తర కొరియా నుంచి ఎటువంటి స్పందన లేదు.