రష్యా- ఉక్రెయిన్ మధ్య ఉత్కంఠ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేశారు. చర్చలు జరపడానికి తాము సిద్ధంగానే వున్నామని పుతిన్ ప్రకటించారు. చర్చలకు సిద్ధమే అయితే… తమ దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని, వాటిని విస్మరించి ఏమీ చేయమని తేల్చి చెప్పారు. చర్చల కోసం తమ దేశం సదా సిద్ధమే. అందులో అనుమానమే లేదు. దాని ద్వారానే పరిష్కారం దొరుకుతుందని కూడా నమ్ముతున్నాం అని పుతిన్ ప్రకటించారు. తూర్పు ఉక్రెయిన్లోని రెండు వేర్పాటు వాద ప్రాంతాలను ప్రత్యేక దేశాలుగా పరిగంచే విషయంపై కూడా స్పందించారు.
ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకోవాల్సి ఉందని, కాస్త ఆలస్యంగా తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ రెండు ప్రాంతాలను గుర్తించాల్సిన అవసరం ఉందని, ఇది చరిత్ర అని పుతిన్ పేర్కొన్నారు. తాము మాత్రం అత్యాధునిక ఆయుధాలను తయారు చేస్తూనే వుంటామని, కృత్రిమ మేధ విషయంలోనూ కాస్త దూకుడుగానే వుంటామని ఆయన స్పష్టం చేశారు. ఇవన్నీ కూడా దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే చేస్తున్నామని పుతిన్ పేర్కొన్నారు.