మాస్కో: ఉక్రెయిన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తలు ఏర్పడిన వేళ ఆ దేశంలోని రెండు వేర్పాటువాద ప్రాంతాలకు స్వతంత్ర హోదా కల్పిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. తూర్పు ఉక్రెయిన్లోని డొనెట్స్క్, లుహాన్స్క్లను స్వతంత్ర రాష్ట్రాలుగా గుర్తిస్తున్నామన్నారు. ఆ రాష్ట్రాలకు మిలటరీ సహకారం అందిస్తామని చెప్పారు. ఈ మేరకు వేర్పాటువాద నాయకులతో ఒప్పందాలపై సంతకం చేశారు. సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత జాతినుద్దేశించి పుతిన్ ప్రసంగించారు. రష్యాపై వ్యతిరేక చర్యలను అడ్డుకునే హక్కు తమకుందని స్పష్టం చేశారు.
‘ఉక్రెయిన్ను బయటి శక్తులు నియంత్రిస్తూ తోలుబొమ్మ చేసి ఆడిస్తున్నాయి. ఇతరశక్తుల ద్వారా మమ్మల్ని నియంత్రించాలని అనుకుంటున్నారు. అమెరికా రాయబార కార్యాలయం కీవ్లో కోట్లు కుమ్మరిస్తున్నది. ఉక్రెయిన్ పాఠశాలల్లో రష్యన్ భాష తొలగించారు.’ అని పుతిన్ అన్నారు.
ఉక్రెయిన్ కేవలం తమ పొరుగుదేశం కాదని, అది రష్యా చరిత్రలో భాగమన్నారు. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత రష్యా దోపిడీకి గురయిందన్నారు. ఆధునిక ఉక్రెయిన్ నిర్మాణంలో రష్యా భాగస్వామ్యం ఉందన్నారు. అలాంటి దేశం ఇప్పుడు రష్యాను బ్లాక్మెయిల్ చేయాలని ప్రయత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నదని చెప్పారు. తమ దేశానికి కలుగుతున్న ముప్పుపై స్పందించకుండా ఉండలేమన్నారు.
రష్యా భద్రతకు నాటోతో ముప్పు పొంచి ఉన్నదని పుతిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్లో భారీగా నాటో శిక్షణా కేంద్రాలు వెలిశాయన్నారు. ప్రస్తుతం ఆ దేశం యూఎస్ కాలనీగా మారిందని విమర్శించారు. రష్యాపై ఏ క్షణమైనా దాడి జరిగే ప్రమాదం ఉందని పుతిన్ హెచ్చరించారు. పెంటగాన్ బహిరంగంగానే భూఆధారిత క్షిపణులను తయారుచేస్తున్నదని మండిపడ్డారు. నాటోలో ఉక్రెయిన్ను చేర్చకూడదన్నదే తమ డిమాండని చెప్పారు. రష్యాపై వ్యతిరేక చర్యలను అడ్డుకునే హక్కు తమకుందని వెల్లడించారు.