ఉక్రెయిన్ విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ మంకు పట్టుతోనే వెళ్తున్నట్లు స్పష్టమైంది. ఏమైనా సరే.. ఉక్రెయిన్ను తన దారిలోకి తెచ్చుకోవాల్సిందేనని భీష్మించుకు కూర్చున్నారు పుతిన్. ఏం జరిగినా… ఏం చేసినా… ఉక్రెయిన్ను దారిలోకి తెచ్చుకోవాలన్న ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఈ పనిలో ఎంత నష్టం సంభవించినా సరే… ముందుకెళ్లడానికే పుతిన్ మొగ్గుచూపుతున్నారన్నది ఓ రిపోర్ట్ ద్వారా రూఢీ అవుతోంది. రష్యాకు సంబంధించిన సైనికులు మరణించినా సరే… ముందుకే వెళ్లాని డిసైడ్ అయ్యారట. సుమారు 50,000 సైనికులు మరణించే ఛాన్స్ ఉందని అధికారులు లెక్కలు కట్టినా… 50,000 మంది సైనికులను కూడా కోల్పోడానికి పుతిన్ సిద్ధపడ్డారని ఓ రిపోర్ట్ పేర్కొంది.
మరణాల సంఖ్య గురించి తాను ఆందోళన చెందనని, ఉక్రెయిన్పై విజయబావుటాయే తనకు ముఖ్యమన్న రీతిలో పుతిన్ ఆలోచనా విధానం ఉన్నట్లు తెలుస్తోంది. పరిస్థితులు మరింత విషమించే పరిస్థితులు కూడా ఉన్నాయని, అయినా వెనకడుగు వేయడానికి పుతిన్ ఏమాత్రం సిద్ధంగా లేరని సమాచారం. అయితే సైనికులను దృష్టిలో పెట్టుకొని, దేశంలో మెడికల్ ఎమర్జెన్సీకి సంబంధించిన ఏర్పాట్లు కూడా పుతిన్ సర్కార్ చేస్తోందని సమాచారం. ఈ మెడికల్ ఎమర్జెన్సీలో భాగంగా ఉక్రెయిన్లోని డాక్టర్లందర్నీ పుతిన్ అందుబాటులోకి తెస్తున్నట్లు ఆ రిపోర్ట్ సారాంశం.
రష్యా సైనికులను కాపాడడానికి డాక్టర్లందరూ పాటుపడాలని, వారి ఆరోగ్యానికి సంబంధించి సమస్త బాగోగులను చూసుకోవాల్సిందేనని ప్రభుత్వం రూపొందించిన రిపోర్టులో స్పష్టంగా ఉన్నట్లు రష్యన్ మీడియా పేర్కొంది. ఆ రిపోర్టు ప్రకారం ట్రామా నిపుణులు,కార్డియాలజిస్టులు, పీడియాటిక్ సర్జన్లు, అనస్తీషియా ఇచ్చేవారు, రేడియోలజిస్టులు, నర్సులు, అంటు వ్యాధి నిపుణులు… ఇలా వీరందర్నీ అందుబాటులో ఉండాలని, సైన్యం కోసం, ప్రజల కోసం నిరంతరం పాటు పడాల్సిందేనని రష్యా ఆ రిపోర్టులో స్పష్టం చేసింది.