వాటికన్సిటీ: దీపావళి పండుగ నేపథ్యంలో ప్రతి ఏడాది వాటికన్ సిటీ హిందువులకు సందేశాన్ని పంపుతుంది. అయితే ఈ ఏడాది భిన్నమైన రీతిలో వాటికన్ నగర మతత్వ సంస్థ ఓ భిన్నమైన సందేశాన్ని ఇచ్చింది. అతివాద జాతీయవాదంతో విభజన జరుగుతున్నట్లు హిందువులకు ఇచ్చిన దీపావళి సందేశంలో వాటికన్ తెలిపింది. పాంటిఫిషియల్ కౌన్సిల్ ఫర్ ఇంటర్రిలీజియస్ డైలాగ్ ఈ సందేశాన్ని వినిపించింది. దీపావళి పండుగ నేపథ్యంలో ఆ సందేశాన్ని ఈనెల 29వ తేదీన రిలీజ్ చేశారు. వాటికన్లో ఉన్న ఇంటర్ రిలీజియస్ డైలాగ్ కౌన్సిల్ ప్రతి ఏడాది దీపావళి పూట సందేశాన్ని పంపిస్తుంది. అయితే తొలిసారి తమ సందేశంలో మతతత్వ వాదం, ఉగ్రవాదం, అతివాద జాతీయవాదం, మత విద్వేషాల గురించి ప్రస్తావించింది. పాంటిఫిషియల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ మిగుల్ ఏంజెల్ అయుసో గుక్సాట్ తన సందేశంలో పలు అంశాలపై స్పందించారు. మానవుల మధ్య సామరస్యపూర్వక వాతావరణాన్ని దెబ్బతీస్తున్న అంశాల గురించి ప్రస్తావించారు. ఆ సమస్యలు ఆందోళనకరంగా మారుతున్నట్లు తన సందేశంలో తెలిపారు.
మరో వైపు పోప్ ఫ్రాన్సిస్ ఇవాళ ప్రధాని మోదీని కలిశారు. ఆ ఇద్దరూ వాటికన్ సిటీలో భేటీ అయ్యారు. మోదీతో చర్చలకు పోప్ 30 నిమిషాల సమయం ఇచ్చినట్లు తెలుస్తోంది. మోదీ పాలనలో మతస్వేచ్ఛకు భంగం కలుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇండియాలో మత స్వేచ్ఛ సమస్యగా మారినట్లు ఇటీవల అమెరికా ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ కమిషన్ పేర్కొన్నది. బీజేపీ సర్కార్ చేపడుతున్న చర్యలు.. వ్యవస్థీకృతంగా మతస్వేచ్ఛను ఉల్లఘింస్తున్నట్లు ఆ రిపోర్ట్లో ఆరోపించారు. సమస్యాత్మక సందర్భాల్లో.. ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకురావాలని వాటికన్ సిటీ తన దివాళీ సందేశంలో కోరింది.
పోప్ ఫ్రాన్సిస్ త్వరలో ఇండియాలో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. ఆయన ఇండియా టూర్కు వెళ్లాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. క్రైస్తవ సంఘాల నుంచి ఆయనకు ఆహ్వానం ఉన్నా.. ప్రభుత్వం నుంచి అధికారిక ఆహ్వానం వస్తేనే .. పోప్ ఫ్రాన్సిస్ ఇండియా టూర్ చేపట్టే ఛాన్సు ఉంది. 1999లో చివరిసారి పోప్ జాన్ పౌల్ ఇండియాలో టూర్ చేశారు. పోప్ ఫ్రాన్సిస్ను ఇండియాకు ఆహ్వానించినట్లు తాజాగా ప్రధాని మోదీ తన ట్వీట్లో వెల్లడించారు.