వాషింగ్టన్: ఒక మహిళ (US Woman) డ్రింక్లో విషం కలిపి భర్తను హత్య చేసింది. ఆ తర్వాత తన స్నేహితులకు గ్రాండ్గా పార్టీ ఇచ్చింది. ఏడాది తర్వాత ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అమెరికాలోని ఉటా రాష్ట్రంలో ఈ సంఘటన జరిగింది. కమాస్లోని విల్లో కోర్ట్ ప్రాంతంలో నివసించే కౌరీ డార్డెన్ రిచిన్స్ తన భర్త ఎరిక్ రిచిన్స్ను హత్య చేసేందుకు 2022లో పెద్ద ప్లాన్ వేసింది. ఆ ఏడాది ఫిబ్రవరిలో నొప్పిని తగ్గించే డ్రగ్ను ఒకరి ద్వారా తెప్పించుకుంది. అలాగే మరో రెండు నిషేధిత పదార్థాలను కూడా సేకరించింది. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా భార్యాభర్తలు కలిసి డిన్నర్ చేశారు. ఈ సందర్భంగా డ్రింక్లో వాటిని కలిపి భర్త ఎరిక్కు కౌరీ ఇచ్చింది. ఆ పార్టీ తర్వాత అతడు అనారోగ్యం పాలయ్యాడు.
కాగా, కౌరీ ఆ తర్వాత రెండు వారాలపాటు నిషేధిత డ్రగ్స్ను సేకరించి డ్రింక్లో కలిపి భర్త ఎరిక్కు ఇచ్చింది. దీంతో మార్చి 4న అతడు అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. గమనించిన ఆమె పోలీసులకు ఫోన్ చేసింది. ఎరిక్ను హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. ఆ మరునాడు ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమె తన స్నేహితులను పిలిచింది. వారికి పెద్ద పార్టీ ఇచ్చింది. మద్యం తాగడంతోపాటు వారితో కలిసి ఎంజాయ్ చేసింది.
మరోవైపు భర్త మరణించిన ఏడాది తర్వాత ‘నాతో ఉన్నారా?’ అనే పిల్లల పుస్తకాన్ని కౌరీ ప్రచురించింది. ప్రియమైన వ్యక్తిని కోల్పోయిన పిల్లలకు క్లిష్ట అనుభావాల నుంచి మార్గనిర్దేశం చేసే ఈ పుస్తకం హృదయాలను కలిచివేస్తుంది. కష్టమైన సవాళ్లను వ్యక్తిగతంగా ఎదుర్కొన్న తల్లి తన పిల్లలపై ప్రేమతో ఈ పుస్తకం రాసినట్లు డిస్క్రిప్షన్ ఇచ్చారు. తమ వారిని కోల్పోయిన యువ మనస్సులకు ఈ పుస్తకం ఓదార్పు అందిస్తుందని పేర్కొన్నారు.
కాగా, కౌరీ భర్త ఎరిక్ ఓవర్ డోస్ డ్రగ్స్ వల్ల చనిపోయినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. సుమారు ఐదుసార్లు నిషేధిత పదార్థాలను సేవించడం వల్ల అతడు చనిపోయినట్లు మెడికల్ రిపోర్ట్లో తేలింది. ఈ నేపథ్యంలో కౌరీని పోలీసులు ప్రశ్నించారు. ఆమె ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందకపోవడంతో ఎరిక్ మరణంపై మరింత దర్యాప్తు చేశారు. ఉద్దేశపూర్వకంగానే తన భర్తకు విషమిచ్చి కౌరీ హత్య చేసిందని తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో హత్య కేసు నమోదు చేసి సెర్చ్ వారంట్ జారీ చేసిన పోలీసులు గత వారం ఆమెను అరెస్ట్ చేశారు.