Nuclear Missile : పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న వేళ అమెరికా (USA) లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అత్యంత శక్తిమంతమైన ఖండాంతర అణు క్షిపణిని అగ్రరాజ్యం పరీక్షించింది. ఈ అణు క్షిపణి పరీక్ష మంగళవారమే జరుగగా.. ఆ పరీక్షకు సంబంధించిన వివరాలు తాజాగా బయటికొచ్చాయి. కాలిఫోర్నియా తీరంలోని వాండెన్బర్గ్ స్పేస్ఫోర్స్ బేస్ నుంచి మంగళవారం రాత్రి 11 గంటలకు మినిట్మ్యాన్-3 (Minuteman-III) బాలిస్టిక్ మిస్సైల్ (Ballistic Missile) ను అమెరికా ఎయిర్ఫోర్స్ గ్లోబల్ స్ట్రైక్ కమాండ్ పరీక్షించింది.
ఆయుధాల్లేని ఈ ఖండాంతర క్షిపణి మార్షల్ ఐలాండ్స్లో నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించినట్లు యూఎస్ స్పేస్ఫోర్స్ వెల్లడించింది. ఈ పరీక్ష విజయవంతమైందని, అత్యంత కచ్చితత్వంతో క్షిపణి లక్ష్యాన్ని చేరుకుందని తెలిపింది. క్షిపణిలోని ఒక్కో విభాగం పనితీరును స్పష్టంగా తెలుసుకునేందుకు ఈ పరీక్ష చేపట్టినట్లు యూఎస్ స్పేస్ఫోర్స్ పేర్కొన్నది. అయితే ఇరాన్ (Iran) పై దాడుల వేళ ఈ అణు క్షిపణి పరీక్ష నిర్వహించడం చర్చనీయాంశం అయ్యింది. మినిట్మ్యాన్-3లో అత్యంత శక్తిమంతమైన మార్క్-21 రీఎంట్రీ వెహికల్ ఉంటుంది.
దీనిలో న్యూక్లియర్ పేలోడ్ను అమర్చవచ్చు. జపాన్లోని హిరోషిమాపై జారవిడిచిన అణుబాంబు కంటే 20 రెట్లు శక్తిమంతమైన అణు వార్హెడ్లను ఇది మోసుకెళ్లగలదు. గతంలో పలుమార్లు దీని శక్తి సామర్థ్యాలను అమెరికా పరీక్షించింది. ఈ క్షిపణి గంటకు 15 వేల మైళ్ల వేగంతో 6 వేల మైళ్ల దూరం వరకు ప్రయాణించగలదు. దీన్ని ప్రయోగించిన కొన్ని నిమిషాల్లోనే లక్ష్యాన్ని ఛేదించగలదు. చివరగా గత ఏడాది నవంబర్లో మినిట్మ్యాన్-3ని అమెరికా పరీక్షించింది.