హైదరాబాద్ : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(US President Trump) చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసేలా ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్తో యుద్ధం(Iran war) అతి త్వరలోనే ముగుస్తుందని, తాను ఎప్పుడు ముగించాలనుకుంటే అప్పుడు యుద్ధానికి తెరపడుతుందని చెప్పిన ట్రంప్ నేడు ఆదేశంపై మరోసారి ఫైర్ అయ్యారు. ఇరాన్ యుద్ధం చివరి అంకానికి చేరుకుందని, ఆ దేశం భారీ మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు. వైట్హౌస్లో జరిగన ‘ఉమెన్ హిస్టరీ మంత్’ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్లో ఏది చేయాలో అదే చేస్తున్నామని తెలిపారు.
అలాగే ప్రపంచంలోనే అమెరికా సైనిక శక్తి గొప్పదన్నారు. ప్రపంచంలో మరెవరికి ఇలాంటి సైనిక శక్తి లేదన్నారు. ఎన్నో ఏండ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు.కాగా, ఇరాన్తో యుద్ధం అతి త్వరలోనే ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం పునరుద్ఘాటించారు. తాను ఎప్పుడు ముగించాలనుకుంటే అప్పుడు యుద్ధానికి తెరపడుతుందని ఆక్సియోస్కు ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. ఇక ఇరాన్లో లక్ష్యంగా చేసుకోవడానికి ఏమీ మిగల్లేదని ఆయన పేర్కొన్నారు. పశ్చిమాసియాలో రోజురోజుకు ఉద్రిక్తతలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఎప్పుడైతే యుద్ధం ముగియాలని అనుకుంటానో.. అప్పుడు అది ముగిసిపోతుంది’ అని అన్నారు.
ఇరాన్ యుద్ధంలో తాము అనుకున్న లక్ష్యాలను సాధించామని ట్రంప్ పేర్కొన్నప్పటికీ, పశ్చిమాసియాలో దాడులు మాత్రం ఆగడం లేదు. అవసరమున్నంత కాలం అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై సంయుక్త ఆపరేషన్ను కొనసాగిస్తూనే ఉంటాయని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కట్జ్ తెలిపారు. ప్రస్తుతం తాము నిర్వహిస్తున్న ఆపరేషన్కు ఎలాంటి కాలపరిమితి లేదని అన్నారు. అయితే ఇరాన్తో యుద్ధం అంత సులువు కాదని తెలిసొచ్చే ట్రంప్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇరాన్పై దాడులకు అమెరికా పెద్దమొత్తంలో నిధులను వెచ్చిస్తున్నది. యుద్ధం మొదలైన తొలి ఆరు రోజులకు గానూ అగ్రరాజ్యం ఏకంగా రూ. లక్ష కోట్లు ఖర్చు చేసినట్టు సమాచారం. దీంతో అమెరికాలో సైతం యుద్ధంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.