Donald Trump : అమెరికా-ఇరాన్ మధ్య రెండో దశ శాంతి చర్చల కోసం ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చర్చలపై గుడ్ న్యూస్ అంటూ ట్రంప్ ప్రకటించారు. రెండు లేదా మూడు రోజుల్లో ఇరాన్తో చర్చలు ఉంటాయంటూ ట్రంప్ బుధవారం వెల్లడించారు. రాబోయే 36 నుంచి 72 గంటల్లో లేదా శుక్రవారం నాడు ఇరాన్తో రెండో దశ శాంతి చర్చలు జరుగుతాయని ట్రంప్ తెలిపారు. అంతకుముందు కూడా ట్రంప్.. ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇరాన్ ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో.. పాక్ సైన్యాధ్యక్షుడు అసిమ్ మునీర్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ విజ్ఞప్తి మేరకు ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నాడు. ఇరాన్ నాయకత్వం, ప్రతినిధులు కలిసి కొత్త ప్రతిపాదనతో వచ్చేంతవరకు వారికి సమయం ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా వెల్లడించాడు. అంతేకాదు.. అంతవరకు హార్ముజ్ జలసంధిని దిగ్బంధించాలని, కాల్పుల విరమణ పాటించాలని సూచించినట్లు తెలిపాడు. మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాక్ పర్యటన కూడా వాయిదా పడింది. ఆయన శాంతి చర్చల కోసం మంగళవారమే పాక్ వెళ్లాల్సి ఉంది.
కానీ, ఇరాన్ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఈ పర్యటనను వాయిదా వేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. మరోవైపు తమ నౌకల్ని అమెరికా బంధించడంపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీన్ని యుద్ధ నేరంగా అభిప్రాయపడింది. తమ దేశ వాణిజ్య నౌకలకు అడ్డుపడి, వాటిని అధీనంలోకి తీసుకోవడాన్ని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. అయితే, వీటిని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసంటూ ఇరాన్ ప్రకటించింది.