వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) పోలాండ్లో పర్యటించనున్నారు. ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర నేపథ్యంలో ఆ దేశంలో పరిస్థితులపై చర్చిండానికి ఈ నెల 25న పోలండ్ వెళ్లనున్నారు. ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రెజ్ దుడాతో సమావేశమవనున్నారని అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్ తెలిపింది. బైడెన్ మొదట బ్రస్సెల్స్కు వెళ్తారని, అటునుంచి వచ్చే శుక్రవారం వార్సాకు చేరుకుంటారని ప్రెస్ సెక్రెటరీ జెన్ప్సాకి వెల్లడించారు. దైపాక్షిక సంబంధాలపై ఈ దేశాల అధ్యక్షులు చర్చించుకుంటారని వెల్లడించారు.
ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో.. ఆ దేశ ప్రజలు పొరుగేనే ఉన్న పోలాండ్కు భారీగా తరలివెళ్తున్నారు. దీంతో లక్షల సంఖ్యలో శరణార్థులకు ఆశ్రయమిస్తున్నది. ఉక్రెయిన్లోని విదేశీయలు తమ స్వదేశాలకు తరలి వెళ్లడానికి సహాయం చేస్తున్నది. అదేవిధంగా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అమెరికా తన సైనికులను నాటో మిత్రదేశమైన పోలాండ్లో పెద్దసంఖ్యలో మోహరించింది.
కాగా, ఉక్రెయిన్పై రష్యా అన్యాయంగా దాడికి దిగిందని అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఈ యుద్ధం వల్ల మానవ సంక్షోభం ఏర్పడిందని, దీనిపై ఎలా స్పందించాలనే విషయంపై తమ మిత్రులు, భాగస్వామ్య దేశాల అధినేతలతో బైడెన్ చర్చిస్తారని వైట్హౌస్ ప్రకటించింది.