కీవ్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(US President Joe Biden) .. ఆకస్మిక పర్యటన చేపట్టారు. ఉక్రెయిన్ (Ukraine)రాజధాని కీవ్(Kyiv)కు ఆయన చేరుకున్నారు. ఉక్రెయిన్పై రష్యా(Russia) దాడికి దిగి ఏడాది కావొస్తున్న తరుణంలో.. బైడెన్ ఈ పర్యటన చేపట్టడం ఆశ్చర్యకరం. ఉక్రెయిన్ సరిహద్దు దేశం పోలాండ్లోనూ బైడెన్ పర్యటించనున్నారు. అక్కడ ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రేజ్ దుడాతో ఆయన సంప్రదింపులు జరపనున్నారు. ఓ విశిష్టమైన అతిథి వస్తున్నట్లు ఇవాళ ఉక్రెయిన్ రాజధానిలో జోరుగా ప్రచారం సాగింది. అయితే వచ్చేది బైడెన్ అని ఓ స్థానిక నేత తెలిపారు.
బైడెన్తో షేక్హ్యాండ్ ఇస్తున్న ఫోటోను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ(Zelensky) తన టెలిగ్రామ్ అకౌంట్లో పోస్టు చేశారు. కొన్ని క్షణాల క్రితమే ఆయన ఆ ఫోటో షేర్ చేశారు. బైడెన్.. వెల్కమ్ టు కీవ్ అని తెలిపారు. ఉక్రేనియన్ల మద్దతుకు మీ రాక చాలా అవసరమని జెలెన్స్కీ ఆ పోస్టులో తెలిపారు.
కొన్ని వారాల క్రితం జెలెన్స్కీ కూడా అమెరికాలో ఆకస్మికంగా పర్యటించిన విషయం తెలిసిందే. వాషింగ్టన్లో ఆ ఇద్దరూ భేటీ అయ్యారు. రష్యాతో యుద్ధం నేపథ్యంలో మరిన్ని ఆయుధాలను పంపాలని ఆయన అమెరికాను కోరారు.
సెక్యూర్టీ కారణాల వల్ల బైడెన్ టూర్ను చాలా సీక్రెట్గా ఉంచారు. కానీ కీవ్లో ఉన్న అనేక వీధుల్ని ఇవాళ మూసివేశారు. దీంతో ఏదో పెద్ద సంఘటన జరగబోతున్నట్లు అక్కడ పుకార్లు వ్యాపించాయి.
జెలెన్స్కీని కలిసిన తర్వాత బైడెన్ ప్రకటన చేశారు. ఉక్రెయిన్ ప్రజాస్వామ్యానికి, సార్వభౌమత్వానికి, ప్రాంతీయ సమగ్రతకు తమ సపోర్టు ఉంటుందని బైడెన్ తెలిపారు. ఏడాది క్రితం పుతిన్ యుద్ధం మొదలుపెట్టినప్పుడు.. ఉక్రెయిన్ బలహీనంగా ఉందని అనుకున్నారని, పాశ్చాత్య దేశాలు భిన్న అభిప్రాయాలతో ఉన్నాయన్న ఆలోచన పుతిన్లో ఉండేదని, తమను ఓడించేస్తామన్న ధీమాతో పుతిన్ ఉండేవారని, కానీ అది పూర్తిగా తప్పు అని పుతిన్కు తెలిసి వచ్చిందని బైడెన్ అన్నారు. ఉక్రెయిన్ దళాలకు మరింత ఆధునిక ఆయుధాలను అందించనున్నట్లు చెప్పారు. రష్యాపై ఎటువంటి అదనపు ఆంక్షలు ఉండబోవన్నారు.