వాషింగ్టన్: ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన వ్యూహాన్ని మార్చినట్లు తెలుస్తోంది. అమెరికాకు చెందిన సీనియర్ అధికారులు ఈ అంచనా వేశారు. వాస్తవానికి ఉక్రెయిన్ రాజధాని కీవ్ను టార్గెట్ చేస్తూ రష్యా సేనలు ముందుకు కదిలిన విషయం తెలిసిందే. కానీ ఇప్పటికీ కీవ్ ఆ దేశానికి చిక్కలేదు. అక్కడ భారీ నష్టమే జరిగింది. మిగితా నగరాల్లోనూ రష్యా పెను బీభత్సం సృష్టిస్తోంది. అయితే అనుకున్నంత సులువుగా కీవ్ను రష్యా చేజిక్కించుకోలేదని అమెరికా తన రిపోర్ట్లో తెలిపింది. ప్లాన్ మార్చిన రష్యా ఇప్పుడు ఉక్రెయిన్లోని ఆగ్నేయ దిశగా ఉన్న ప్రాంతాలను టార్గెట్ చేసినట్లు అమెరికా వెల్లడించింది. ఆ తర్వాత కీవ్పై వత్తిడి పెంచాలని భావిస్తోందని రష్యా అంచనా వేస్తున్నారు.
కీవ్ను వీలైనంత త్వరగా స్వాధీనం చేసుకుని, అక్కడ ఓ డమ్మీ ప్రభుత్వాన్ని నెలకొల్పాలని రష్యా భావించినట్లు తొలుత అమెరికాతో పాటు మిత్ర దేశాలు అంచనా వేశాయి. అయితే ప్రస్తుతం పుతిన్ తన వ్యూహాన్ని మార్చినట్లు భావిస్తున్నారు. పుతిన్ తన యుద్ధ లక్ష్యాలను విస్తృతపరిచినట్లు చెబుతున్నారు. కీవ్ విషయంలో రష్యా ఎటువంటి వ్యూహాన్ని అనుసరిస్తోందో ఇంకా అర్థంకావడం లేదని కొందరంటున్నారు. ఆ నగరాన్ని చేజిక్కించుకునే సామర్థ్యం రష్యాకు ఉందా లేదా అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. నిజానికి పుతిన్ లక్ష్యం మారలేదని, కానీ ఆయన తన వ్యూహాన్ని మార్చినట్లు అమెరికా ప్రభుత్వాధికారి డానియల్ ఫ్రైయిడ్ తెలిపారు.
అమెరికా అధికారి ఇచ్చిన రిపోర్ట్ను.. బ్రిటీష్ ఇంటెలిజెన్స్ తప్పుపట్టింది. కీవ్పైనే రష్యా సేనలు ఫోకస్ పెట్టినట్లు బ్రిటన్ ఇంటెలిజెన్స్ పేర్కొన్నది. ఆ నగరంలోని ఉత్తరం దిక్కున భారీగా ఫైరింగ్ జరుగుతున్నట్లు బ్రిటన్ రక్షణ మంత్రి తెలిపారు. ఈశాన్యం నుంచి వస్తున్న రష్యా దళాలు ప్రస్తుతం నిలిచిపోయాయని, వాయవ్య దిశ నుంచి వస్తున్న రష్యా సేనలకు ఉక్రేనియన్ల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోందని మంత్రి తెలిపారు. కీవ్కు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో వేల సంఖ్యలో రష్యా బలగాలు ఆగిపోయినట్లు బ్రిటన్ అంచనా వేస్తోంది. రష్యా దళాల ప్రధాన టార్గెట్ కీవ్ అని, అయితే రానున్న కొన్ని వారాల్లో పుతిన్ సైన్యం ఆ నగరాన్ని చుట్టేస్తుందని బ్రిటన్ రిపోర్ట్ పేర్కొన్నది.
మరోవైపు ఆదివారం రాత్రి కీవ్లో జరిగిన దాడుల్లో ఆరుగురు మృతిచెందారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై ఇప్పటి వరకు పలుమార్లు హత్యాయత్నాలు జరిగాయి. కానీ ఆయన తప్పించుకున్నారు.