వాషింగ్టన్, ఏప్రిల్ 23 : అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణలు మరో కొత్త ప్రమాదకర దశలోకి ప్రవేశించాయి. హొర్ముజ్ జలసంధిలో మందుపాతరలు(సీమైన్స్) అమర్చుతున్నట్లు అనుమానించే పడవలకు ఆయుధాలతో బుద్ధి చెప్పాలని అధ్యక్షుడు ట్రంప్ అమెరికా నౌకాదళాన్ని ఆదేశించారు. హొర్ముజ్ జలసంధిలో సీమైన్స్ అమరుస్తున్నట్లు అనుమానించిన ఏ పడవనైనా కాల్చి నాశనం చేయండని ఆయన నౌకాదళానికి ఆదేశాలు జారీచేశారు. హొర్ముజ్ జలసంధి జలాల్లో మందుపాతరలు పెడుతున్న ఏ పడవనైనా, అవి చిన్న పడవలు అయినప్పటికీ (వారి నౌకాదళానిక చెందిన 159 ఓడలన్నీ సముద్ర గర్భంలో ఉన్నాయి) కాల్చి ధ్వంసం చేయమని అమెరికా నౌకాదళాన్ని ఆదేశించాను. ఈ విషయంలో సంకోచించరాదు అని ట్రూత్ సోషల్ పోస్టులో ట్రంప్ పేర్కొన్నారు. జలసంధిలో మందుపాతలరను తొలగించే కార్యక్రమం ఇప్పటికే చేపట్టిందని ఆయన చెప్పారు.
ఈ పోస్టు తర్వాత కొన్ని నిమిషాలకే ట్రంప్ మరో పోస్టులో ఇరాన్ నాయకత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తమ నాయకుడు ఎవరో తేల్చుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నది! వాళ్లకు అసలు తెలియడం లేదు. యుద్ధభూమిలో ఘోరంగా ఓడిపోతున్న పిడివాదులకు , అసలు మితవాదులు కాకపోయినా గౌరవం పొందుతున్న మితవాదులకు మధ్య జరుగుతున్న ఈ అంతర్గత పోరాటం సరదాగా ఉంది అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. జలసంధిపై అమెరికాకు పూర్తి నియంత్రణ ఉందని, ఏ నౌక కూడా లోపలకు ప్రవేశించదు లేదా బయటకు వెళ్లదని ట్రంప్ పేర్కొన్నారు.
సీమైన్ల ముప్పు తీవ్రత మొదట్లో అనుకున్న దాని కంటే ఎక్కువగా ఉండవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ది న్యూయార్క్ టైమ్స్ ప్రకారం ఘర్షణ సమయంలో తాను అమర్చిన మైన్లన్నింటినీ గుర్తించలేకపోవడం వల్ల ఇరాన్ ఆ జలసంధిని పూర్తిగా తిరిగి తెరవడానికి ఇబ్బంది పడుతున్నది. చిన్న పడవల ద్వారా కొన్ని మైన్లను ఇరాన్ అమర్చింది. అయితే వాటిని కచ్చితంగా ఎక్కడ అమర్చిందీ నమోదు చేయలేకపోయారని పత్రిక తెలిపింది.