ఇస్లామాబాద్ : పాకిస్థాన్లోని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. 21 గంటలపాటు సుదీర్ఘంగా చర్చలు సాగినప్పటికీ, శాంతి ఒప్పందంపై ఇరుపక్షాలు ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి. దీంతో ఇటీవల కుదిరిన రెండు వారాల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం భవితవ్యం ప్రమాదంలో పడింది. చర్చలు విఫలం కావడానికి కారణం మీరంటే మీరేనంటూ ఇరుపక్షాలు పరస్పరం నిందించుకున్నాయి. యుద్ధం ముగింపునకు తుది, అద్భుత ఆఫర్ను అమెరికా అందించినప్పటికీ, ఇరాన్ అంగీకరించలేదని అమెరికా బృందానికి నేతృత్వం వహించిన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్కొన్నారు. అమెరికా వల్లే చర్చలు విఫలమయ్యాయని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ బకర్ ఘాలిబఫ్ విమర్శించారు. మా విశ్వాసాన్ని పొందడంలో అమెరికా విఫలమైందని పేర్కొన్నారు. అమెరికా అసంబద్ధ, చట్టవిరుద్ధ డిమాండ్లు చేసిందని ఇరాన్ విదేశాంగ శాఖ ఆరోపించింది. చర్చలు విఫలం కావడంతో హొర్ముజ్ తెరుచుకోవడంపై సందిగ్ధత ఏర్పడింది. ఇరాన్పై మళ్లీ అమెరికా దాడులకు దిగుతుందా అన్నదానిపైనా స్పష్టత లేదు.
చర్చల అనంతరం ఇస్లామాబాద్ నుంచి అమెరికాకు బయలుదేరే ముందు వాన్స్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇరానియన్లతో 21 గంటలపాటు విస్తృత చర్చలు జరిపాం. అది గుడ్న్యూస్. బ్యాడ్ న్యూస్ ఏంటంటే, మేం ఒప్పందానికి రాలేకపోయాం. ఇది అమెరికా కంటే ఇరాన్కే ఎక్కువ బ్యాడ్ న్యూస్’ అని పేర్కొన్నారు. ఇరాన్కు బెస్ట్ డీల్ను ఆఫర్ చేశామని, కానీ ఇరాన్ అంగీకరించలేదని చెప్పారు. ‘ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోకుండానే మేం అమెరికాకు తిరిగి వెళ్లిపోతున్నాం. మా రెడ్లైన్స్ ఏంటో వారికి స్పష్టంగా చెప్పాం’ అని వాన్స్ పేర్కొన్నారు. అణ్వాయుధం తయారు చేయకూడదు అన్న షరతుతో పాటు తమ ఇతర డిమాండ్లకు ఇరాన్ అంగీకారం తెలుపలేదని చెప్పారు. భవిష్యత్తులో ఇరాన్ అణ్వాయుధాలను సమకూర్చుకోవడానికి కానీ, తయారు చేయడానికి కానీ ప్రయత్నించకుండా ఉంటామనే స్పష్టమైన హామీని అమెరికా కోరుకుంటున్నదని పేర్కొన్నారు. ‘అమెరికా అధ్యక్షుడి ప్రథమ లక్ష్యం అదే. ఈ చర్చల ద్వారా దాన్ని సాధించేందుకు ప్రయత్నించాం’ అని వాన్స్ తెలిపారు. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత అమెరికా, ఇరాన్ మధ్య ఉన్నతస్థాయి ప్రత్యక్ష చర్చలు జరగడం ఇదే మొదటిసారి. అమెరికా ప్రతినిధి బృందంలో ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్ ఉన్నారు. ఇరాన్ ప్రతినిధి బృందంలో పార్లమెంటరీ స్పీకర్ మహమ్మద్ బకర్ ఘాలిబఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఉన్నారు.

ఇరాన్ అణు కార్యక్రమం, హొర్ముజ్ జలసంధి నియంత్రణ, స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం వంటి అంశాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతోనే చర్చలు విఫలమయ్యాయని ఇరాన్ మీడియా తెలిపింది. చర్చల సందర్భంగా తమ ప్రతినిధి బృందం సానుకూల ప్రతిపాదనలు అందించిందని, అయితే అమెరికా తమ నమ్మకాన్ని పొందలేకపోయిందని ఘాలిబఫ్ తెలిపారు. ‘మా ప్రజల హక్కుల సాధనకు సైనిక పోరాటంతోపాటు దౌత్యం కూడా ఓ మార్గమని భావిస్తున్నాం. అయితే 40 రోజుల యుద్ధంలో సాధించిన విజయాలను సుస్థిరం చేసుకునే ప్రయత్నాలను విరమించుకోం’ అని ఆయన స్పష్టంచేశారు. అమెరికా అర్థం లేని డిమాండ్లే ఒప్పందం కుదరకపోవడానికి కారణమని ఇరాన్ పాక్షిక ప్రభుత్వ మీడియా సంస్థ తాస్నిమ్ ఆరోపించింది. యుద్ధం ద్వారా సాధించలేకపోయినవి అమెరికా చర్చల్లో ప్రతిపాదించిందని స్థానిక మీడియా పేర్కొన్నది. హొర్ముజ్ జలసంధి, అణు శక్తికి సంబంధించి అమెరికా సాధ్యం కాని ప్రతిపాదలు చేసిందని, ఇరాన్ వాటిని తిరస్కరించినట్టు వెల్లడించింది.