వాషింగ్టన్: ఉక్రెయిన్తో జరుగుతున్న పోరులో రష్యా తన సైన్యాధికారుల్ని కోల్పోతున్న విషయం తెలిసిందే. అయితే అమెరికా ఇంటెలిజెన్స్ శాఖ ఇస్తున్న సమాచారంతోనే రష్యా సైన్యాధికారుల్ని ఉక్రెయిన్ హతమారుస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. రష్యా జనరల్స్ను ఉక్రెయిన్ టార్గెట్ చేయడానికి ఇదే కారణమని అమెరికా అధికారులు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో రష్యా 12 మంది టాప్ సైన్యాధికారుల్ని కోల్పోయినట్లు ఉక్రెయిన్ తెలిపింది. అయితే రష్యా బలగాల కదలికలకు సంబంధించిన సమాచారాన్ని అమెరికా ఇంటెలిజెన్స్ నుంచి తీసుకుని ఉక్రెయిన్ దళాలు దాడులకు పాల్పడినట్లు న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో రాసింది. రష్యా సైన్యాధికారుల్ని టార్గెట్ చేసే క్రమంలో ఉక్రెయిన్ సక్సెస్ అయినట్లు ఆ రిపోర్ట్లో తెలిపారు.
వరుసగా మేటి సైన్యాధికారుల్ని కోల్పోవడం వల్లే రష్యా దళాల్లో ఆత్మస్థయిర్యం లోపించి ఆఫీసర్లంతా ఫ్రంట్లైన్కే పరిమితం అవుతున్నట్లు తేలింది. అయితే అమెరికా ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారంతో ఎంత మంది జనరల్స్ను హతమార్చారో ఆ కథనంలో స్పష్టతనివ్వలేదు. న్యూయార్క్ టైమ్స్ రాసిన కథనాన్ని వైట్హౌజ్ ప్రతినిధి తప్పుపట్టారు. ఆ కథనంలో బాధ్యతారహితంగా ఉందని, తప్పుదోవ పట్టించేలా ఉందన్నారు. యుద్ధరంగానికి సంబంధించిన సమాచారాన్ని ఉక్రెయిన్కు అమెరికా అందిస్తుందని, కానీ రష్యా జనరల్స్ను హతమార్చే ఉద్దేశంతో కాదు అని నేషనల్ సెక్యూర్టీ కౌన్సిల్ ప్రతినిధి ఆండ్రియేన్ వాట్సన్ తెలిపారు.