US | ఇరాన్పై(Iran) మొన్నటి వరకు భౌతిక దాడులకు పాల్పడిన అమెరికా(America) ఇప్పుడు రూటు మార్చింది. సరికొత్త ఆంక్షల పేరుతో టెహ్రాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని యోచిస్తున్నది. ఇందులో భాగంగా అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్(Scott Bessent)ఇరాన్పై చరిత్రలోనే అత్యంత తీవ్రమైన ఆర్థిక ఆంక్షలను(Economic sanctions) ప్రకటించారు. ‘ఆపరేషన్ ఎకనామిక్ అవుట్క్యాస్ట్’ పేరుతో ఈ కొత్త ఆంక్షల ప్యాకేజీని ప్రకటించారు. ఇరాన్ ఆర్థిక మూలాలను పూర్తిగా దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. టెహ్రాన్పై ఇది ఒక ‘ఆర్థిక డి-డే’ (Economic D-Day) లాంటిదని హెచ్చరించారు. డిజిటల్ ఆస్తులు, టెక్నాలజీ, బంగారం, విమానయానం, నౌకా రవాణా వంటి కీలక రంగాలను ఈ ఆంక్షల పరిధిలోకి తీసుకొచ్చారు. ఇరాన్తో వ్యాపారం కొనసాగించే ఇతర దేశాలు, సంస్థలపై కూడా ద్వితీయ స్థాయి ఆంక్షలు విధించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
దీంతో పాటు ఇరాన్ చమురు ఆదాయం, ఆయుధాల సేకరణ, సైబర్ కార్యకలాపాలతో సంబంధం ఉన్న 60కి పైగా వ్యక్తులు, కంపెనీలు, నౌకలపై కూడా ఆంక్షలు విధించారు. ఇరాన్తో ఆర్థిక పోరులో ఇది చివరి అంకమని (Endgame) అమెరికా ప్రకటించింది. ఇరాన్తో సంబంధాలు తెంచుకోవాలని ప్రపంచ దేశాల నాయకులను కోరారు. మీరు మా వైపు ఉంటారా లేక మాకు వ్యతిరేకంగా ఉంటారా” అని అల్టిమేటం జారీ చేశారు. ఇప్పటికే ఇరాన్కు మద్దతు ఇస్తున్న సుమారు 60 సంస్థలు, విదేశీ నౌకలపై అమెరికా నిఘా పెట్టింది. సహకరించే ఇతర దేశాలకూ ఆంక్షల భయం ఉంటుందని తెలిపారు. ఇరాన్తో ఆర్థికంగా భాగస్వామ్యం వహించే ఏ దేశమైనా ఏకాకిగా మిగిలిపోతుందని బెసెంట్ తెలిపారు. యూఎస్ ప్రకటనపై ఇటు ఇరాన్ ప్రభుత్వం కూడా ఘాటుగా స్పందించింది. ట్రంప్ ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఎదుర్కొవడానికి మా వద్ద రెండేండ్ల ప్రణాళిక ఉందని, ప్రతీకార దాడులు తప్పవని బదులిచ్చింది.
ఇరాన్ ఆర్థిక మంత్రి అలీ మదనీజాదేహ్ మాట్లాడుతూ.. “అమెరికా ఆంక్షలను ఎదుర్కొనేందుకు మేం సర్వసన్నద్ధంగా ఉన్నాం. శత్రువులు మాపై ఆర్థిక ఉగ్రవాద దాడికి పాల్పడాలని చూస్తున్నారు. కానీ, మా వద్ద కూడా తగిన సాధనాలు ఉన్నాయి. ఇకపై మాది కేవలం రక్షణే కాదు, శత్రువులు మా దాడి కోసం ఎదురుచూడాలి” అని హెచ్చరించారు. అమెరికా ఆంక్షలను చైనా, రష్యా అంగీకరించలేదని, ఇతర దేశాలు కూడా ప్రతిఘటిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహసెన్ రెజాయ్ మరింత ఘాటుగా స్పందించారు. అమెరికాకు సహకరించే ఏ దేశమైనా ‘భూకంపం లాంటి’ ప్రతీకారాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పొరుగు దేశాలు సహకరిస్తే పర్షియన్ గల్ఫ్ లేదా హార్ముజ్ జలసంధి నుంచి చుక్క నూనె కూడా బయటకు వెళ్లనివ్వబోమని తేల్చిచెప్పారు. కాగా, ఇరాన్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాలపై ప్రభావం చూపుతున్నది. పెరిగిన చమురు ధరలు జీవన వ్యయంపై ఆందోళనలను పెంచాయి. పెట్రోల్,డీజిల్ ధరలు ఏడాది క్రితం కంటే చాలా ఎక్కువగా ఉండంతో అమెరికాతో పాటు అన్ని దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. మరో వైపు ఇరాన్పై ఆంక్షలను ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు స్వాగతించారు.