వాషింగ్టన్: రెండేండ్లుగా అదృశ్యమైన బాలిక ఆచూకీని ఎట్టకేలకు పోలీసులు కనుగొన్నారు. ఒక ఇంట్లోని మెట్ల కింద రహస్య చీకటి గదిలో ఉన్న చిన్నారిని రక్షించారు. అమెరికాలోని న్యూయార్క్లో ఈ ఘటన జరిగింది. తమ కుమార్తె ఆరేండ్ల పైస్లీ షుల్టిస్ కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు కింబర్లీ, కిర్క్ 2019లో నూయార్క్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ చిన్నారిని కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.
దీంతో ఆ బాలిక ఆచూకీ కోసం పోలీసులు గత రెండేండ్లుగా వెతకసాగారు. చివరకు ఇటీవల ఒక ఆధారం లభించింది. బాలిక మాయమైన ప్రాంతం నుంచి 240 కిలోమీటర్ల దూరంలోని స్పెన్సర్ పట్టణంలో ఆమె ఉన్నట్లు పోలీసులకు తెలిసింది. దీంతో వారు ఆ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఉన్న ఒక ఇంట్లో సుమారు ఒక గంటపాటు వెతికారు. చివరకు మూసి ఉన్న మెట్ల కింద భాగంలో రహస్యంగా ఏర్పాటు చేసిన చిన్నపాటి చీకటి, తడిగా ఉన్న గదిలో ఆ బాలికను కనుకొన్నారు. ఆ బాలికతోపాటు తండ్రి కింబర్లీ కూపర్ షుల్టిస్ కూడా అక్కడ ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.
కాగా, ఆ బాలికను అన్ని రోజులు రహస్యంగా దాచడంపై తాము ఆశ్చర్యపోయినట్లు పోలీస్ చీఫ్ జోసెఫ్ సినాగ్రా సీఎన్ఎన్తో అన్నారు. దర్యాప్తు కోసం తాము చాలా సార్లు ఆ ఇంటికి వెళ్లినట్లు చెప్పారు. అయితే బాలిక తండ్రి కూడా కుమార్తె ఆచూకీపై గత రెండేండ్లుగా తమకు అబ్ధం చెప్పాడని ఆరోపించారు. ఆ బాలిక ఆరోగ్యంగానే ఉన్నదని, ఆమెపై ఎలాంటి అఘాయిత్యం జరుగలేదన్నారు.
పోలీసులు రక్షించిన తర్వాత మెక్డొనాల్డ్స్ హ్యాపీ మీల్ను ఆ బాలిక కోరిందని పోలీస్ చీఫ్ జోసెఫ్ తెలిపారు. ఆ చిన్నారిని ప్రమాదంలో పడేసిన తల్లిదండ్రులతోపాటు, ఆమెను తాత ఇంట్లో దాచిన నేపథ్యంలో ఆయనపై కూడా కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు.