వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్పై ఇవాళ హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. వాషింగ్టన్ హిల్టన్ హోటల్(Washington Hilton Hotel)లో వైట్హౌజ్ కరస్పాండెంట్స్ డిన్నర్లో పాల్గొనేందుకు వెళ్లిన ట్రంప్ ఫ్యామిలీని ఓ సాయుధుడు టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో కాల్పులకు పాల్పడిన దుండగుడిని అరెస్టు చేశారు. హిల్టన్ హోటల్కు.. హింక్లే హిల్టన్ అన్న పేరు కూడా ఉన్నది. 1981 మార్చి 30వ తేదీన ఈ హోటల్ వద్దే అప్పటి దేశాధ్యక్షుడు రోనాల్డ్ రీగన్పై హత్యాయత్నం జరిగింది. జాన్ హింక్లే జూనియర్ అనే వ్యక్తి ఆనాటి దేశాధ్యక్షుడు రోనాల్డ్ రీగన్పై కాల్పులు జరిపాడు. కొన్ని సెకన్ల వ్యవధిలోనే అతను రీగన్పై ఆరు రౌండ్లు ఫైర్ చేశాడు. డిన్నర్లో మాట్లాడి బయటకు వస్తున్న రీగన్పై షూట్ చేశారు.
ప్రెసిడెంట్ రీగన్కు చెందిన లిమోసిన్ కారు నుంచి బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఆ బుల్లెట్లు రీగన్ ఛాతిలో దిగాయి. ఆ కాల్పుల ఘటనలో రీగన్ తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఘటనలో మరో ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి ప్రెస్ సెక్రటరీ జేమ్స్ బ్రాడీ కూడా ఆ గాయపడ్డ బృందంలో ఉన్నాడు. ఆయనతో పాటు ఓ పోలీసు ఆఫీసర్, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ కూడా గాయపడ్డారు. అయితే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు.. అధ్యక్షుడు రీగన్ను తమ కారులో జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆయనకు సర్జరీ చేశారు. ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. కాల్పుల ఘటన జరిగిన ప్రదేశం నుంచి హింక్లేను కస్టడీలోకి తీసుకున్నారు.
శనివారం రాత్రి కూడా వాషింగ్టన్లో ఇలాంటి ప్రయత్నమే జరిగింది. ఓ ఆగంతకుడు ట్రంప్ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే వైట్హౌజ్ కరెస్పాండెంట్స్ డిన్నర్కు రిపోర్టర్లు హాజరవుతారు. బాల్రూమ్ వైపు దూసుకువచ్చిన ఆగంతకుడు సుమారు 8 రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ట్రంప్, ఆయన సతీమణి మేలానియా.. ప్రధాన వేదికపై ఉన్నారు. కాల్పుల శబ్ధం వినబడగానే.. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఆయన్ను చుట్టుముట్టేశారు. సురక్షితంగా మరో రూమ్కు తరలించారు. ఇక డిన్నర్ టేబుళ్ల వద్ద ఉన్న అతిథులు .. భయంతో ఆ టేబుళ్ల కింద నక్కారు.
సాయుధుడిని అడ్డుకున్న ఓ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ గాయపడ్డారు. ప్రస్తుతం అతను క్షేమంగా ఉన్నాడు. అనుమానిత సాయుధుడు కూడా కస్టడీలో ఉన్నాడు. మరో 30 రోజుల్లో మళ్లీ వైట్హౌజ్ కరస్పాండెంట్స్ డిన్నర్ను ఏర్పాటు చేయనున్నట్లు ట్రంప్ తెలిపారు.