కాబూల్: ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో మరోసారి తాలిబన్ల రాజ్యం రావడంతో అక్కడి ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఆ దేశం నుంచి బయటపడటానికి వేల మంది ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా దేశ సరిహద్దులకు తరలి వెళ్లడంతోపాటు కాబూల్ ఎయిర్పోర్ట్కు కూడా భారీగా చేరుకుంటున్నారు. ఏవైనా విమానాలు ఉంటే సాధ్యమైనంత తొందరగా అక్కడి నుంచి బయటపడాలని భావిస్తున్నారు. భారీగా వస్తున్న ఈ జనాలను చూసి ఆందోళన చెందిన అక్కడి అమెరికా బలగాలు ఎయిర్పోర్ట్ దగ్గర గాల్లోకి కాల్పులు జరిపాయి. వాళ్లు పెద్ద ఎత్తున గాల్లోకి కాల్పులు జరుపుతున్నారని, అది చూస్తే చాలా భయంగా ఉన్నదని ఓ ప్రత్యక్ష సాక్షి న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్పీకి చెప్పారు.