కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లోకి తాలిబన్లు ప్రవేశించడంతో అక్కడి అమెరికా రాయబార కార్యాలయం అధికారులు కీలక పత్రాలు, సామగ్రిని ధ్వంసం చేశారు. అత్యవసర విధ్వంస సేవల్లో భాగంగా సున్నితమైన పత్రాలు, ఫైల్స్, వస్తువులు, ఇతర సమాచారాన్ని నాశనం చేయాలన్న అమెరికా ప్రభుత్వం ఆదేశాల మేరకు వాటిని ధ్వంసం చేశారు. తాలిబన్ల ఆక్రమణ నేపథ్యంలో దుర్వినియోగమయ్యేందుకు వీలున్న ఎంబసీ లోగోలు, అమెరికా జెండాలతోపాటు ఇతర ముఖ్య వస్తువులను అధికారులు నాశనం చేశారు.
కాగా, ఎమర్జెన్సీ సమయాల్లో అమెరికా రాయబార కార్యాలయలంలోని కీలకమైన వాటిని నాశనం చేయడానికి అనేక మార్గాలు ఉంటాయని CNN పేర్కొంది. కాల్చేవేసే డబ్బాలు, డిసింటెగ్రేటర్, ఇన్సినేరేటర్, కాంపాక్టర్, బరువైన పరికరాలతో కీలకమైన వాటిని ధ్వంసం చేస్తారని తెలిపింది. కీలక పత్రాలు, సామగ్రి ధ్వంసం నేపథ్యంలో శనివారం కాబూల్లోని అమెరికా రాయబార కార్యాలయం నుంచి పొగలు కనిపించినట్లు చెప్పింది. అమెరికా హెలీకాప్టర్ల రాకపోకలు, దౌత్యవేత్తల వాహనాల కదలికలు పెరిగాయని వెల్లడించింది.
మరోవైపు అమెరికా దౌత్యవేత్తలు, సిబ్బంది, ఆ దేశ పౌరులు, మిషన్కు సహకరించిన ఆఫ్ఘనిస్థాన్లను సురక్షితంగా తరలించడానికి 5,000 మంది సైన్యాన్ని కాబూల్కు తరలించాని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శనివారం ఆదేశించారు.