వాషింగ్టన్: ఈ భూమి అత్యంత వైవిద్ధ్యంతో కూడినదని, అయితే మానవీయ విలువలు మనందరినీ ఏకం చేస్తున్నాయని ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్ చెప్పారు. మనలో ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైనవారే అయినప్పటికీ, అందరూ ఒకటేనని గుర్తించగలిగే జ్ఞానం మనందరికీ ఉందని తెలిపారు. మన జీవితాలను పండుగలా గడుపుదామని, సవాళ్లను స్వీకరించి, ధైర్యంగా ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. మన కోసం, రాబోయే తరాల కోసం మరింత మెరుగైన భవిష్యత్తును ఆశిద్దామని చెప్పారు. వాషింగ్టన్ డీసీలోని నేషనల్ మాల్లో ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ఆధ్వర్యంలో జరుగుతున్న నాలుగో ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో శనివారం ఆయన మాట్లాడారు.
ఈ ఉత్సవాల తొలి రోజున జరిగిన కార్యక్రమాలను ప్రత్యక్షంగా దాదాపు 10 లక్షల మంది వీక్షించినట్లు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రకటించింది. ఈ ఉత్సవాల్లో 180 దేశాల ప్రముఖ కళాకారులు పాల్గొన్నట్లు తెలిపింది. ప్రపంచంలోని విభిన్న సంస్కృతుల సమాహారంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. మానవాళిని మానవత్వం, శాంతి సందేశాలతో ఏకం చేయడమే తమ లక్ష్యమని వెల్లడించింది. ఆచార్య లోకేశ్ ముని, ఐరాస మాజీ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్, వాషింగ్టన్ డీసీ నగర మేయర్ మురియెల్ బౌసర్, భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు.
ప్రముఖ భారతీయ ఆధ్యాత్మిక గురువులు శ్రీశ్రీ రవిశంకర్, ఆచార్య లోకేశ్ ముని ప్రపంచ శాంతి, సామరస్యాల కోసం గొప్ప కృషి చేస్తున్నట్లు అమెరికన్ కాంగ్రెస్ ప్రశంసించింది. శ్రీశ్రీ రవిశంకర్, ఆచార్య లోకేశ్ ముని సేవలను భారతీయ సంతతి ప్రతినిధి రాజా కృష్ణమూర్తి కొనియాడారు.