హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): అమెరికాలో చదువు.. అక్కడే పెద్దపెద్ద కంపెనీల్లో ఉద్యోగం.. చీకూచింతా లేని జీవితం.. ఇదీ ఎంతోమంది భారతీయ విద్యార్థుల రంగుల కల. అమెరికా యూనివర్సిటీల్లో చదివే మన విద్యార్థులకు మంచి డిమాండ్ కూడా ఉన్నది. ఉన్నత చదువులు చదివిన తెలివైన విద్యార్థులను ఎంత జీతమైనా ఇచ్చి ఎగరేసుకుపోయేందుకు అక్కడి కంపెనీలు పోటీ పడుతుంటాయి. సాధారణంగా సాఫ్ట్వేర్ వంటి ఉద్యోగాల్లో చేరేందుకు మన విద్యార్థులు అమెరికాలో మాస్టర్స్ ఇన్ సైన్స్ (ఎంఎస్) ఎక్కువ చదువుతుంటారు. ఆ అర్హత ఉన్నవారికి కంపెనీలు భారీగా వేతనాలు ఇవ్వటమే ఇందుకు కారణం. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఎంఎస్ విద్యార్థులకంటే బ్యాచిలర్ ఇన్ సైన్స్ (బీఎస్) విద్యార్థులకే డిమాండ్ పెరిగింది. బీఎస్ వారికే కంపెనీలు ఎక్కువ వేతనాలు ఇస్తున్నాయి. వారినే ఏరికోరి రిక్రూట్ చేసుకొంటున్నాయి. ఎంఎస్ గ్రాడ్యుయేట్లకు 70 వేల డాలర్ల వరకు వార్షిక వేతనం ఇస్తుండగా, బీఎస్ వారికి గరిష్ఠంగా 1.3 లక్షల డాలర్ల వరకు ప్యాకేజీ ఆఫర్ చేస్తున్నారు. కొన్ని కంపెనీలయితే ప్రతిభావంతులకు 2 లక్షల డాలర్ల వరకు వేతనాలిచ్చేందుకు ముందుకొస్తున్నాయి.
విషయ పరిజ్ఞానం మెండు
బ్యాచిలర్ పూర్తిచేసిన వారికి విషయ పరిజ్ఞానం అధికంగా ఉంటుంది. అందుకే మన విద్యార్థులు అమెరికా, కెనడాల్లో బీఎస్ చదివేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో మాస్టర్స్ కోర్సుల కోసం యూఎస్ వెళ్లేవారు. ఇప్పుడు ఇంటర్ పూర్తికాగానే అమెరికా వెళ్లాలనుకునే వారి సంఖ్య పెరుగుతున్నది. తల్లిదండ్రులు కూడా అలాగే ఆలోచిస్తున్నారు.
– హరికాంత్రెడ్డి, డైరెక్టర్ ఎడు2టెక్